హైదరాబాద్‌‌ పై ఎగిరేది గులాబీ జెండానే : కేటీఆర్

హైదరాబాద్‌‌ పై ఎగిరేది గులాబీ జెండానే :  కేటీఆర్
  • ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలుపు మాదే: కేటీఆర్​
  •     రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్‌‌‌‌ఎస్​ పార్టీనే అని కామెంట్‌‌
  •     కాంగ్రెస్​ కన్నా ఎక్కువ రౌడీయిజం బీఆర్‌‌‌‌ఎస్‌‌కు తెలుసు: తలసాని

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం గులాబీ జెండాయేనని, గెలిచేది బీఆర్‌‌‌‌ఎస్​ పార్టీయేనని బీఆర్‌‌‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్​, బీజేపీలు చేసిందేమీ లేదని విమర్శించారు. పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అని, బీజేపీ 12 ఏండ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని విమర్శించారు. ఎట్టికైనా..మట్టికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తుంటారని, అందుకే ఈ రాష్ట్రానికి బీఆర్‌‌‌‌ఎస్​ మాత్రమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌‌లోని తెలంగాణభవన్‌‌లో జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.  

గ్రేటర్​ హైదరాబాద్‌‌లో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం బీఆర్‌‌‌‌ఎస్‌‌లోనే ఉన్నారన్నారు. వాళ్లే పార్టీకి వెన్నెముకలా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం.. పార్టీకి నెంబర్​ వన్​ కోటగా ఉన్నదని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినా బంగారంలాంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని 24 డివిజన్లనూ క్లీన్​ స్వీప్​ చేసే సత్తా బీఆర్‌‌‌‌ఎస్​ పార్టీకి ఉందన్నారు. 

త్వరలో జరిగే ఎన్నికల కోసం డివిజన్లవారీగా సమావేశాలను నిర్వహించుకుందామని, ఎమ్మెల్యే లేడని భయపడొద్దని సూచించారు. రాబోయేది మళ్లీ బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వమేనని, కేసీఆర్​ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పాలనలో హైదరాబాద్​ ప్రతిష్ట దెబ్బతింటున్నదని, పట్టపగలే సుల్తాన్​ బజార్​ ఎస్‌‌బీఐ బ్రాంచ్​ వద్ద దోపిడీలు, చందానగర్‌‌‌‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. కేసీఆర్​ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవన్నారు.   

తెలంగాణ చరిత్రలో కేసీఆర్​ శాశ్వతం: తలసాని

తెలంగాణ చరిత్రలో కేసీఆర్​ శాశ్వతంగా ఉండిపోతారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్​.. కేసీఆర్​ అంటే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అనేకమంది ప్రారంభించినా.. గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాకారం చేసింది మాత్రం కేసీఆరేనని చెప్పారు. తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ అని పేర్కొన్నారు. 

‘‘ఎవడ్రా జాతిపిత అంటూ రేవంత్​ మాట్లాడుతున్నారు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆ పాపం ఊరికే పోదు. లోకల్​ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్​ రౌడీయిజం చేసింది. దానిని ప్రజలు గమనిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్​ కన్నా ఎక్కువ రౌడీయిజం బీఆర్‌‌‌‌ఎస్‌‌కు తెలుసని, ఆ రౌడీయిజం తెలంగాణ కోసమే ఉంటుందని పేర్కొన్నారు.