V6 News

చెన్నై, బెంగళూరు,పూణేకు..శంషాబాద్ నుంచే బుల్లెట్ రైళ్లు..! పట్టాలెక్కనున్న కారిడార్ పనులు

చెన్నై, బెంగళూరు,పూణేకు..శంషాబాద్ నుంచే బుల్లెట్ రైళ్లు..! పట్టాలెక్కనున్న కారిడార్ పనులు
  • గత బడ్జెట్​లో 3  రైళ్లను ప్రకటించిన కేంద్రం
  • బహదూర్ గూడలో 650 ఎకరాల గుర్తింపు  
  • అతిపెద్ద రైల్వేహబ్ గా మారనున్న శంషాబాద్ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: శంషాబాద్ కేంద్రంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి శంషాబాద్ మండలంలోని బహదూర్ గూడలో రైల్వే అధికారులు 650 ఎకరాలను గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు,చెన్నై, పుణెల మధ్య ఈ హై స్పీడ్ ట్రైన్స్ నడవనున్నాయి. గత ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్​లో తెలంగాణకు మూడు హైస్పీడ్​ రైళ్లను కేంద్రం ప్రకటించింది. 

ఇవి కూడా హైదరాబాద్​ కేంద్రంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలపగా, శంషాబాద్​లోనే ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్​శ్రీవాస్తవ కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి భూముల కోసం పరిశీలన జరుపుతున్న అధికారులు శంషాబాద్​మండలంలోని బహదూర్​గూడలో 650 ఎకరాలు గుర్తించారు. ఇక్కడి నుంచే కేంద్రం ప్రకటించిన హైస్పీడ్​ రైళ్లను నడపనున్నారు. దీంతో శంషాబాద్​దేశానికి అతిపెద్ద రైల్వేహబ్ గా, ప్రధాన నగరాలను కలిపే ఏకైక హైస్పీడ్​ కారిడార్​గా అభివృద్ధి కానున్నది. 

ఈ ప్రాజెక్టు రాకతో శంషాబాద్​తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో లోకల్​ట్రాన్స్​పోర్ట్​డెవలప్​అవుతుందని, పారిశ్రామికంగా భారీ ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో దేశంలోనే ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిన శంషాబాద్.. తాజాగా హైస్పీడ్​ రైల్​ హబ్​ఏర్పాటుతో మరోసారి హాట్​టాపిక్​గా మారింది.  

రూ. 48వేల కోట్లతో ప్రాజెక్టు

హైస్పీడ్​రైల్​కారిడార్​ను రూ. 48వేల కోట్లతో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. భూముల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే హైదరాబాద్-​– బెంగళూరు, హైదరాబాద్​-–చెన్నై కారిడార్ల డీపీఆర్​రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. తర్వాత 2027–-28లో హైదరాబాద్​– పుణె కారిడార్​డీపీఆర్ ​సిద్ధమవుతుందన్నారు.  

హైస్పీడ్​ రైళ్లతో ప్రయాణ సమయం ఆదా

ప్రస్తుతం హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే 8 నుంచి 10 గంటలు, పుణెకు 10 నుంచి 11 గంటలు, చెన్నైకి 8గంటల నుంచి 9 గంటలు పడుతోంది. మూడు కారిడార్లకు సంబంధించి హైస్పీడ్​ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్​నుంచి బెంగళూరుకు 2 గంటలు, చెన్నై కి 2.55 గంటలు, పుణెకు 1.55 గంటలు మాత్రమే పడుతుంది. 

దీంతో ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఎవరైనా ఒకే వర్కింగ్​డేలో మూడు నగరాల్లో ఏ సిటీకి అయినా అతి తక్కువ సమయంలో వెళ్లిపోవచ్చు. ఈజీ, స్పీడ్​కనెక్టివిటీ వల్ల వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.