అదృష్టం కొద్ది కేసీఆర్ సీఎం అయ్యారు..అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది: మంత్రి ఉత్తమ్ 

అదృష్టం కొద్ది కేసీఆర్ సీఎం అయ్యారు..అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది: మంత్రి ఉత్తమ్ 
  • ప్రజలకు వాస్తవాలు తెలియాలనే సీఎం రేవంత్​ అలా మాట్లాడారని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కొద్ది మంది ఎంత శ్రమించినా కాలం కలిసిరాదని.. అయితే, కేసీఆర్ మాత్రం అదృష్టం కొద్ది సీఎం అయ్యారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడినట్టు చెప్పారు.

సీఎంగా రేవంత్ రెడ్డిపై ఆ బాధ్యత ఉందన్నారు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. రుణమాఫీ, ఇతర ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణలో 70 శాతం ప్రజలు ప్రభుత్వం పై సంతృప్తి గా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడ్డం తీసుకుంటానని చెప్పానని.. అయితే, ప్రస్తుతం గడ్డం తనకు కంఫర్టబుల్ గా ఉందని ఉత్తమ్​చెప్పారు.  

సన్న బియ్యం స్కీంకు కేంద్రం ఇస్తున్నదేమీ లేదు

దేశ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ స్కీం కోసం కేంద్రం అందిస్తున్న సహకారం ఏమీ లేదన్నారు. తెలంగాణలోని బిలో పావర్టీ లైన్(బీపీఎల్) కుటుంబాలకు మాత్రమే కేంద్రం బియ్యం ఇస్తున్నదని చెప్పారు. అది కూడా 5 కిలోలు మాత్రమేనని అన్నారు. నిజంగా కేంద్రమే అంతా భరిస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం స్కీం ఎందుకు లేదని ప్రశ్నించారు.

కేంద్రం ఇచ్చే బియ్యంతో రీసైక్లింగ్ జరుగుతోందని తెలిసినా.. మోదీ సర్కార్ మొక్కుబడిగా బియ్యం ఇచ్చిందని విమర్శించారు. అయితే, తాము తెలంగాణలో పండిన సన్నబియాన్నే ప్రజలకు పంపిణీచేస్తున్నట్టు తెలిపారు. దీంతో బ్లాక్ మార్కెట్, రీసైక్లింగ్ మాఫియాను 95శాతం అరికట్టామని వెల్లడించారు. దాదాపు 99% ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సన్నబియాన్నే తింటున్నారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకం అని కితాబిచ్చారు. 

తెలంగాణ కోర్ కమిటీ వాయిదా

తెలంగాణ కోర్ కమిటీ మీటింగ్ కోసం ఢిల్లీ వచ్చినట్టు ఉత్తమ్​ చెప్పారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరగాల్సిన భేటీ వాయిదా పడిందన్నారు. ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.