
సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా పై మోకిలా పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. షేక్ ఫరీద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ ఫరీద్ అనే వ్యక్తి సునీల్ కుమార్ అహుజా దగ్గర రూ. 17 కోట్లు లోన్ తీసుకున్నాడు. లోన్ ఇచ్చేటపుడు ఫరీద్ నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ పత్రాలు సెక్యూరిటీ గా తీసుకున్నాడు సునీల్ అహుజా. మోకిలా, శంకర్ పల్లిలో ఖరీదైన ల్యాండ్ పత్రాలు సెక్యూరిటిగా పెట్టాడు ఫరీద్.
రూ.17 కోట్లకు వడ్డీతో కలిపి సునీల్ అహుజాకు రూ. 22 కోట్లు చెల్లించాడు ఫరీద్. అయినా సరే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా కబ్జా చేశారు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా . అంతటితో ఆగకుండా ఈ ల్యాండ్ తమదేనని అహుజా తండ్రి కొడుకులిద్దరు తనను బెదిరిస్తున్నారని బాధితుడు షేక్ ఫరీద్ మోకిలా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ అహుజా పై కేసు నమోదు చేశారు.
ఇదే సునీల్ అహుజా భారతి బిల్డర్స్ వ్యవహారం లోను ఇదే రీతిలో కబ్జా చేశాడు. భారతి బిల్డర్స్ వ్యవహారంలో బాధితులు 500 మంది వరకు ఉన్నారు. భారతి బిల్డర్స్ పేరుతో చలామణి అయిన ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని 250 బాధితులు రోడ్డెక్కారు. 5 సంవత్సరాల కిందట భారతి బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. భారతి బిల్డర్స్ కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు. సాకులు చెబుతూ భారతి బిల్డర్స్ బాధితులను మోసం చేస్తూ వచ్చింది.
అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసి ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు డబ్బులు కట్టిన పబ్లిక్ను భారతి బిల్డర్స్ నిండా ముంచేసింది. ఇదేంటని భారతి బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించగా.. భారతి బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతి బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్లో ఆర్థిక నేర విభాగం(EOW) పోలీసులు కేసు నమోదు చేశారు.