రివాల్వర్తో బెదిరించాడని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

రివాల్వర్తో బెదిరించాడని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

గచ్చిబౌలి, వెలుగు: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్​ రివాల్వర్​తో బెదిరించాడంటూ ఆయన అల్లుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయదుర్గం ఇన్​స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ తన కుమార్తెను పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​గౌడ్​ కొడుకు అభిషేక్​గౌడ్​కు ఇచ్చి 14 ఏండ్ల క్రితం వివాహం చేశారు. మణికొండ పంచవటీ కాలనీలోని తన ఇంటిని కూతురు అల్లుడు ఉండేందుకు ఇచ్చాడు. 

కొన్నాళ్ల తరువాత అభిషేక్​గౌడ్​ మరో ఇంటికి షిఫ్ట్​ అయ్యాడు. ప్రభాకర్​ ఇచ్చిన ఇంటిని కృష్ణ ధర్మ పరిషత్​ ఆఫీసుకు ఇచ్చాడు. ఇందులో అభిషేక్​గౌడ్​ మామ వెంకటేశ్​గౌడ్​, రాముయాదవ్​ రూ.కోటి ఖర్చు చేసి ఇంటీరియర్​ వర్క్​ చేయించారు. అభిషేక్​గౌడ్​కు తన భార్యతో వివాదాలు ఏర్పడి ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో తాను ఇచ్చిన ఇంటిని కేఈ ప్రభాకర్​ తిరిగి తీసుకున్నాడు. అయితే, ఇంటీరియర్​ కోసం తాము పెట్టిన డబ్బులు ఇవ్వడం లేదని వెంకటేశ్​ గౌడ్​, రాముయాదవ్​ అక్టోబర్​ 24న ఇంటికి తాళం వేశారు. 

మరుసటి రోజు దీనిపై మాట్లాడుకునేందుకు ఇరు వర్గాలు పంచవటీ కాలనీలో కలుసుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కేఈ ప్రభాకర్​ తమను రివాల్వార్​తో బెదిరించాడని వెంకటేశ్​గౌడ్​ వర్గం, తమనే వెంకటేశ్​గౌడ్​ వర్గం బెదిరించిందని కేఈ ప్రభాకర్​ వర్గం పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు రివాల్వర్​తో బెదిరింపులు లేవని తేల్చారు.