‘జై మహాభారత్’ పార్టీ రిజిస్ట్రేషన్​ పై ఈసీకి పోలీసుల లేఖ

 ‘జై మహాభారత్’ పార్టీ రిజిస్ట్రేషన్​ పై ఈసీకి పోలీసుల లేఖ

‘జై మహాభారత్’ పార్టీలో​ సభ్యత్వం తీసుకుంటే ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ 5 లక్షల ఆధార్ కార్డులు సేకరించిన ఫేక్ బాబా భగవాన్‌ అనంత విష్ణు ప్రభు అలియాస్‌ రామ్ దాస్ పై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదైంది. పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్ట్రాక్షన్ అభియోగాలతో ఐపీసీ 420, 290,341 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పార్టీ రిజిస్ట్రేషన్​ పై  సైఫాబాద్ పోలీసులు  ఎన్నికల సంఘాని (ఈసీ)కి లేఖ రాశారు. భారీ ఎత్తున ఆధార్‌కార్డులు సేకరించారంటూ ఫిర్యాదు చేశారు. ఆధార్‌ కార్డును సమర్పించి జైమహాభారత్‌ పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి .. 200  గజాల ఇళ్ల స్థలం ఇస్తానని రామ్‌దాస్‌ ప్రజలను నమ్మించినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ తరువాత రామ్‌దాస్‌పై మరిన్ని కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఏం జరిగింది ? 

‘జై మహాభారత్’ పార్టీ ​ సభ్యత్వం తీసుకుంటే.. వైకుంఠం  ట్రస్ట్​ ద్వారా ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ ఆ పార్టీ ప్రెసిడెంట్​, ఫౌండర్​ భగవాన్​ అనంత విష్ణు ప్రచారం చేశారు. లక్డీకాపూల్​ అడ్డాగా సాగుతున్న ఈ తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘నేను మహా విష్ణువును. లక్ష్మీ దేవి భర్తను. పేదల కోసమే పార్టీ పెట్టాను. నా పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రతీ ఒక్కరికి వైకుంఠం ట్రస్ట్​ ద్వారా 200 గజాల ఇళ్ల స్థలం ఇప్పిస్తాను’ అంటూ క్యాంపెయిన్​ చేపట్టినట్లు సమాచారం. దీని కోసం రెండు ఫొటోలు, ఆధార్​ కార్డు జిరాక్స్​ ప్రతులను  కలెక్ట్​ చేస్తున్నారు. ఐదు నెలలుగా సభ్యత్వాల నమోదు కొనసాగుతోంది. వారం రోజుల్లో దరఖాస్తుల గడువు ముగుస్తుందని ప్రచారం జరగడంతో.. లక్డీకాపూల్లోని పార్టీ ఆఫీస్ ఎదుట​ మహిళలు భారీగా క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్​ జామ్ అయ్యింది. వాహనదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు.. అక్కడికి చేరుకొని విచారించగా అసలు బాగోతం బయటపడింది.