హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రెండు పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని అమ్నీషియాతో పాటు ఇన్సోమ్నియా పబ్బుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాత్రి 10 తర్వాత సౌండ్లు పెట్టకూడదని ఇంతకు మునుపే హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఈ రెండు పబ్బులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లోని పబ్స్పై తెలంగాణ హైకోర్టు గత కొన్ని రోజుల క్రితమే కీలక ఆదేశాలిచ్చింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలను గట్టిగానే మందలించడంతో పాటు.. పబ్బులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పబ్బుల్లో సౌండ్ వినిపించొద్దని తేల్చి చెప్పింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పబ్బుల్లో ఎలాంటి సౌండ్ పెట్టొద్దని సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకేనని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.