సోషల్ మీడియాను ఊపేస్తున్న పంజాబ్ పెళ్లి.. వధువుపై నోట్ల వర్షం చూస్తే షాకే..

సోషల్ మీడియాను ఊపేస్తున్న పంజాబ్ పెళ్లి.. వధువుపై నోట్ల వర్షం చూస్తే షాకే..

పంజాబ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆడంబరం.. ఆ గాలిలో ఉండే జోష్. అయితే ఇటీవల తార్న్ తరన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పెళ్లి మండపంపై పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు చేసిన పని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వధువు చుట్టూ నిలబడి లక్షలాది రూపాయల డబ్బులను వర్షంలా గాల్లోకి విసురుతూ చల్లటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. పెళ్లి కూతురు మండపం మధ్యలో నిలబడి ఉండగా.. పెళ్లికొడుకు ఒక బ్యాగ్ నిండా తెచ్చిన కరెన్సీ కట్టలను గాలిలోకి విసురుతూ కనిపించాడు. కేవలం పెళ్లి కొడుకే కాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా పోటీ పడి మరీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఒకవైపు డీజే పాటలు, మరోవైపు నోట్ల వర్షంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కింద పడిన నగదును అక్కడి సిబ్బంది పోగు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నగదు విలువపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఇది ఏకంగా 8.5 కోట్ల రూపాయలని ప్రచారం చేస్తుండగా.. మరికొందరు మాత్రం 2 నుంచి 4 లక్షల లోపే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పష్టత లేనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం విలాసానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అది వారి సొంత డబ్బు, వారు నచ్చినట్టు ఖర్చు చేసుకుంటారని కొందరు సమర్థిస్తుంటే.. అంత డబ్బును పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు కదా అని మరికొందరు సలహా ఇస్తున్నారు.

మరోవైపు నాగ్‌పూర్‌లో జరిగిన 'హల్దీరామ్ వెడ్డింగ్' కూడా వార్తల్లో నిలుస్తోంది. హల్దీరామ్ గ్రూప్ వారసుడు వివేక్ అగర్వాల్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్.. భారీ వెడ్డింగ్ కేక్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వరమాల సమయంలో జరిగిన బాణసంచా ప్రదర్శన అతిథులను మంత్రముగ్ధులను చేసింది. పంజాబ్ నగదు వర్షం, నాగ్‌పూర్ రాయల్ వెడ్డింగ్.. ఈ రెండూ కలిపి భారతీయ వివాహాల్లోని ఆడంబరాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి.