రూ.3వేలు చెల్లించలేదని కుల బహిష్కరణ

రూ.3వేలు చెల్లించలేదని కుల బహిష్కరణ

ఓ కుటుంబాన్ని వెలేశారు కుల పెద్దలు. నాలుగేళ్ళ క్రితం కుల బహిష్కరణ చేసిన కుటుంబంతో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. కుల పంచాయతీ ఫీజు మూడువేలు చెల్లించలేదని ఈ దుర్మాగానికి పాల్పడ్డారు పెద్దమనుషులు. చివరకు తన తల్లి చనిపోయినా కుల పెద్దలు కరుణించకపోవడంతో.. ఇతర కులస్థులతో దహన సంస్కారాలు చేయించారు. నాలుగేల్లు ఓపిక పట్టిన బాధితుడు చేసేది లేక మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన ఇతని పేరు కుమ్మరి లింగన్న. ఇతన్ని గానీ… వీళ్ళ కుటుంబ సభ్యులను గానీ…గ్రామంలో ఎవరూ పలకరించరు. కనీసం అతని వైపు కూడా చూడరు. ఎవరైనా ఈ  కుటుంబాన్ని పలకరిస్తే…. కులపెద్దలు 10వేల రూపాయల జరిమానా వేస్తారు. నాలుగేళ్ళుగా  ఈ వ్యవహారం సాగుతోంది.  అప్పట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ… కుల పెద్దల దగ్గర పంచాయతీకి వెళ్లింది. భార్య తరఫు వాళ్లు పంచాయతీ ఫీజు కింద 3వేల రూపాయలు చెల్లించారు. లింగన్న పేదరికంతో మూడు వేలు కట్టలేదు. దాంతో ఆగ్రహించిన కులపెద్దలు.. తమ కులం నుంచి లింగన్న కుటుంబాన్ని వెలేశారు. ఇంటి పక్కవాళ్లు కూడా ఈ కుటుంబంతో మాట్లాడటం, ఫంక్షన్లకు పిలవడం మానేశారు. దీంతో గత నాలుగేళ్ళుగా మానసికక్షోభ అనుభవిస్తున్నారు లింగన్న కుటుంబ సభ్యులు.

ఈ ఏడాది మార్చిలో లింగన్న తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా ఎవరూ వెళ్ళొద్దని హెచ్చరించారు. దీంతో ఇతర కులస్థుల సహకారంతో  తల్లి దహన సంస్కారాలు పూర్తిచేశాడు లింగన్న. జరిమానా విధిస్తారన్న భయంతో బంధువులు కూడా ఇళ్ళకు రావడం మానేశారు. దాంతో న్యాయం కోసం ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు లింగన్న. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినందుకు మరో 18వేల జరిమానా, కుల పెద్దలకు ఆటో, కూలీ చార్జీలతో పాటు మందు, విందుకు డబ్బులు చెల్లించాలని కుల సంఘంలో నిర్ణయించారు. దీంతో చేసేది లేక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు లింగన్న. అసలు ఈ గొడవకి కారణమైన భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మెలిసి ఉంటున్నా బహిష్కరణ మాత్రం ఇంకా కొనసాగుతోంది.

లింగన్న నాలుగేళ్ళుగా అధికారులు, పోలీసుల చుట్టూ తిరిగినా.. న్యాయం జరగడం లేదు. పైగా కులపెద్దల వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలు కూడా ఇదేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు.