సీనియార్టీని బట్టి జర్నలిస్టుల కేటగిరీలు

సీనియార్టీని బట్టి జర్నలిస్టుల కేటగిరీలు
  •  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లజాగలిస్తం: పొంగులేటి
  • హెచ్​యూజే డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ ఇండ్లు లేదా ఇండ్ల జాగలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందని చెప్పారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే – టీడబ్ల్యూజేఎఫ్​) డైరీని బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్​లోని తన నివాసంలో సంఘం నేతలతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు జర్నలిస్టులు సహకారం అందించాలని ఆయన కోరారు.

 ఈ సందర్భంగా ఇండ్లు, ఇండ్లస్థలాలు, జర్నలిస్టుల సమస్యలను హెచ్​యూజే నేతలు మంత్రికి తెలియజేశారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం ప్రాధాన్యత అంశంగా ఉందని మంత్రి చెప్పారు. జర్నలిస్టులను సీనియార్టీని బట్టి కేటగిరీలు ఏర్పాటు చేసి, అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అన్నారు. ప్రభుత్వం దృష్టిలో అన్ని జర్నలిస్టు సంఘాలు సమానమేనని తెలిపారు. కార్యక్రమంలో హెచ్​యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, బి.జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, రాధిక, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, హెచ్​యూజే నాయకులు బి.దామోదర్, నాగవాణి, రమేశ్, వీరేశ్, విజయ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.