55 కిలోల గంజాయి పట్టివేత.. భద్రాచలంలో ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్

55 కిలోల గంజాయి పట్టివేత.. భద్రాచలంలో ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్

భద్రాచలం, వెలుగు: మూడు కార్లలో గంజాయిని లోడ్​చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్న ఆరుగురిని భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు హైదరాబాద్​కు చెందిన టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానయ్యతోపాటు, ఎన్​ఫోర్స్ మెంట్​సీఐలు సర్వేశ్వరరావు, లతీఫ్, భద్రాచలం సీఐ రహీమున్నీషాకు పక్కా సమాచారం అందింది.

ఆదివారం ఉదయం భద్రాచలంలో తనిఖీలు చేపట్టగా, అదే టైంలో అటుగా వచ్చిన మూడు కార్లను ఆపి చెక్ చేయగా 55 కిలోల గంజాయి దొరికింది. జగిత్యాలకు చెందిన బొజ్జ మల్లేశ్, కస్తూరి గోవర్ధన్, దొంతర్వేని నర్సయ్య, తోకల లక్ష్మణ్, ఉత్తరాఖండ్​కు చెందిన కిషన్రే, దీపక్ శేఖర్ జానే కలిసి ఒడిశాలోని ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి, కార్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అరెస్ట్​చేసినట్లు ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానయ్య తెలిపారు.