సీబీఐకి చిక్కిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్‌

సీబీఐకి చిక్కిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్‌
  • హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్ట్​
  • కోర్టులో హాజరుపరిచిన అధికారులు.. 3 చోట్ల సోదాలు

యాదాద్రి, వెలుగు: ఓ హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) వరంగల్ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ దుర్గాప్రసాద్​ సీబీఐకి చిక్కారు. ఇటీవల యాదాద్రి జిల్లాలో పర్యటించిన దుర్గా ప్రసాద్.. గూడూరు టోల్​ప్లాజాను సందర్శించారు. అదే సమయంలో టోల్​ప్లాజా సమీపంలో రెస్టారెంట్​నడిపే విషయంతోపాటు హోర్డింగ్స్ ఏర్పాటు కోసం ఓ హోటల్​యజమాని నుంచి రూ.లక్ష డిమాండ్​ చేశారు. 

తాను డైరెక్టర్​గా ఐదేండ్లు కొనసాగుతానని, అన్ని రోజులు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని చెప్పడంతో హోటల్​ యజమాని రూ.60 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ప్రాజెక్ట్​ డైరెక్టర్​డబ్బు డిమాండ్​ చేసిన విషయంపై సీబీఐకి ఫిర్యాదు అందింది. దీంతో అబ్జర్వేషన్​లో పెట్టిన సీబీఐ అధికారులు.. ఈ నెల 19న మంగళవారం హోటల్​ యజమాని నుంచి దుర్గాప్రసాద్​రూ.60 వేలు తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్టు సీబీఐ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలోని ఆఫీసుల్లో దాడులు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. దుర్గాప్రసాద్​ను అరెస్టు చేసిన అనంతరం సీబీఐ అధికారులు గూడూరు టోల్ ప్లాజాకు వచ్చి ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, కొనసాగుతున్న రెస్టారెంట్లను పరిశీలించినట్టు తెలిసింది.