
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎంట్రెన్స్ లో భారీ కుంభకోణం బయటపడింది. రూ. 50 లక్షలు చెల్లిస్తే.. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్వచ్చేలా.. ఇతర వ్యక్తులతో ఎగ్జామ్ రాయిస్తామని మహారాష్ట్రలోని ఓ కోచింగ్ సెంటర్ పలువురు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సహా పలువురు స్టూడెంట్స్ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వర్గాలు బుధవారం తెలిపాయి. కేసు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బేస్డ్ ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ నీట్ స్టూడెంట్స్కు కోచింగ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నీట్ ఎంట్రెన్స్లో మంచి ర్యాంకుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేలా చేస్తామని.. అందుకు అభ్యర్థి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమల్ కొత్పల్లివార్ పలువురు స్టూడెంట్స్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈమేరకు సీట్లు వచ్చాకే డబ్బులు మొత్తం ఇచ్చేలా పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వాలని చెప్పాడు. ఎగ్జామ్ ఆన్లైన్లో కాబట్టి యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఆధార్ వివరాలు ఇస్తే.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఇతర అభ్యర్థులతో పరీక్ష రాయిస్తామని చెప్పాడు. ఒక వేళ అలా కుదరకపోతే ఎగ్జామ్ టైంలో ఆన్సర్ షీట్ఇవ్వడం గానీ, ఓఎంఆర్ మార్చడం గానీ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అసలు స్టూడెంట్స్కు బదులుగా మొత్తం అయిదుగురు ఇతర వ్యక్తులు ఎగ్జామ్కు అటెండ్ అయ్యేలా నకిలీ ఐడీ కార్డులు తయారు చేశారు. విషయం సీబీఐ అధికారులదాకా చేరడంతో ఎగ్జామ్ సెంటర్లోనే నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్లాన్ వేశారు. ఈ నెల 12న నీట్ఎగ్జామ్ రోజు సెంటర్ల వద్ద వేచి ఉన్నారు. కానీ వాళ్లు ఎగ్జామ్కు హాజరుకాలేదు. వెంటనే సీబీఐ ఆఫీసర్లు సంబంధిత కోచింగ్సెంటర్లో సోదాలు చేసి వివరాలు సేకరించారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.