
- రాత్రిళ్లు స్టూడెంట్లు బయటికి వెళ్తున్నారని ఫిర్యాదులు
- ఒక్కో స్కూల్లో 20 నుంచి 30 కెమెరాలు
- గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
- సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకుల స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాత్రిళ్లు స్టూడెంట్లు బయటికి వెళ్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. బాలికల గదుల్లోకి వార్డెన్లు, వాచ్ మెన్లు వెళ్తున్నరానే కంప్లైంట్లు పెరిగాయి. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. వంట చేసే ఏరియా క్లీన్ గా లేకపోవడం, కాంట్రాక్టర్లు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తుండటం వంటి అన్ని అంశాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 268 స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో స్కూల్లో 20 నుంచి 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో ఈ కెమెరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. వీటన్నింటిని లైవ్ లో చూసేందుకు మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించనున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ.. స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్లను అలర్ట్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జోనల్ కేంద్రాలు, కలెక్టర్లకు కూడా యాక్సెస్ కల్పించనున్నారు.
ముందుగా కిచెన్, డైనింగ్ హాల్లో..
గురుకులాల్లో తరుచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గడువు ముగిసిన సరుకులు వాడుతున్నారు. ఏడాదిన్నరలో చాలా చోట్ల ఫుడ్పాయిజన్తో స్టూడెంట్లు అస్వస్థతకు గురవుతున్నారు. అన్ని గురుకులాలను కలిపి స్టేట్ వైడ్ ఒకే టెండర్ ను పిలిచి సరుకులను సరఫరా చేసే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా కిచెన్తో పాటు డైనింగ్ హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు గురుకుల అధికారులు చెప్తున్నారు.
నెల రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పక్రియ పూర్తి చేయనున్నారు. ప్రాక్టికల్స్లో అవకతవకల నేపథ్యంలో ల్యాబ్స్ లో ఇంటర్ బోర్డు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మంచి ఫలితాలను ఇచ్చిందంటున్నారు. ఇప్పటికే గురుకుల అధికారులకు పలు ఏజెన్సీల నిర్వాహకులు సీసీ కెమెరాల ఏర్పాటు, డేటా స్టోరేజ్, క్వాలిటీ వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.