
సికింద్రాబాద్, వెలుగు: సెల్ ఫోన్ చోరీ చేస్తూ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటక బీజాపూర్ జిల్లాకు చెందిన లింగప్ప (28) గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. ఏడాది కిందట సిటీకి వచ్చి సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాప్ ఫుట్పాత్పై ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. అప్పటికే నేర చరిత్ర కలిగిన లింగప్పకు ఆ డబ్బులు చాలకపోవడంతో సెల్ఫోన్ చోరీలు మొదలుపెట్టాడు. అయితే, హన్మకొండకు చెందిన దినేశ్ ఈ నెల 1న తన సొంతూరికి వెళ్లడానికి సికింద్రాబాద్లో శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కాడు.
రైలులో రద్దీ ఉండడంతో డోరు వద్ద కూర్చున్నాడు. రైలు లాలాగూడ నుంచి నెమ్మదిగా కదులుతున్న సమయంలో ట్రాక్ పక్కనే నిలబడి ఉన్న లింగప్ప.. దినేశ్ చేతిలో ఉన్న సెల్ఫోన్ను బలవంతంగా లాక్కుని ఉడాయించాడు. ఈ క్రమంలో దినేశ్ రైలు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 5న మృతి చెందాడు.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం లాలాగూడ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. దీంతో లింగప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే అర్బన్ డీఎస్సీ జావేద్ తెలిపారు.