- వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలోనే వాడతారు.. కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ
న్యూఢిల్లీ: దేశీయంగా డెవలప్ చేసిన కొవాగ్జిన్లో దూడ సీరమ్ వాడారన్న ఆర్టీఐ డాక్యుమెంట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ నేత గౌరవ్ పంధి దాన్ని షేర్ చేయడంతో అది వైరలైంది. ఆ వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం స్పందించింది. వెరో సెల్స్ ఉత్పత్తిలో మాత్రమే దూడ సీరమ్ను వాడారని వివరించింది. వెరో కణాల పెరుగుదలకు పశువులు, ఇతర జంతువుల సీరంను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారని చెప్పింది. వెరో కణాలతో ఇతర కణాలను పుట్టించి వ్యాక్సిన్లలో వాడతారని పేర్కొంది. అవసరమైన కణాలను పుట్టించాక వెరో సెల్స్ను నీటిలో, కెమికల్స్లో కడుగుతారని, ఆ తర్వాత కరోనా వైరస్తో వాటిని ఇన్ఫెక్ట్ చేస్తారని, ఆ ప్రాసెస్లో సెల్స్ పూర్తిగా నాశనమవుతాయని చెప్పింది. అలా పెరిగిన వైరస్ కణాలను చంపి క్లీన్ చేస్తారని.. ఆ తర్వాత వ్యాక్సిన్ తయారీలో వాడతారని పేర్కొంది. కాబట్టి దూడ సీరమ్ను చివరగా బయటకు వచ్చే వ్యాక్సిన్ ఉత్పత్తిలో వాడరని వివరించింది.