కొవిడ్​ రూల్స్​ పాటించలేకపోతే యాత్రను ఆపేయండి.. రాహుల్​ కు కేంద్రం లేఖ

కొవిడ్​ రూల్స్​ పాటించలేకపోతే యాత్రను ఆపేయండి.. రాహుల్​ కు కేంద్రం లేఖ

భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ లకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను  అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు.  ప్రస్తుతం రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​ లో కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కు కూడా పంపింది.

జపాన్​, అమెరికా, చైనా, బ్రెజిల్​, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో  మంగళవారం రోజున అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కొవిడ్​ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

కేంద్ర మంత్రికి అధిర్​ కౌంటర్​

రాహుల్​ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. ‘‘బహుశా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలాంటి లేఖను విడుదల చేశారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు”అని వ్యాఖ్యానించారు.