కాచిగూడ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీల సమస్యలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయంపై చర్చించాలని జాతీయ అఖిలపక్ష ఓబీసీ సెమినార్ డిమాండ్ చేసింది. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ బచావో పేరిట విస్తృత ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది.
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ లో నిర్వహించిన సెమినార్లో బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే దేశంలో వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేశ్ యాదవ్, బాలకృష్ణ, మణికంఠ, వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.
