నీళ్ల పంచాయితీపై కేంద్రం కమిటీ.. ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు చొప్పున అధికారులకు చోటు

నీళ్ల పంచాయితీపై కేంద్రం కమిటీ.. ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు చొప్పున అధికారులకు చోటు
  • నీళ్ల పంచాయితీపై కేంద్రం కమిటీ.. 13 మందితో ఏర్పాటు.. కమిటీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ చైర్మన్
  • ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు చొప్పున అధికారులకు చోటు
  • కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ సీఈలూ సభ్యులు
  • మూడు నెలల్లో రిపోర్ట్‌‌‌‌ సమర్పించాలని కమిటీకి జలశక్తి శాఖ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షుడిగా సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్ వ్యవహరించనున్నారు. శుక్రవారం 13 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 జులై 16న జరిగిన సీఎంల స్థాయి మీటింగ్‌‌‌‌లో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది.

తెలంగాణ నుంచి ఇరిగేషన్​ శాఖ అడ్వైజర్​, ప్రిన్సిపల్​ సెక్రటరీ, స్పెషల్​ సెక్రటరీ, ఈఎన్సీ జనరల్‌‌‌‌కు సభ్యులుగా అవకాశం కల్పించింది. అయితే, ఏడుగురు సభ్యులను నామినేట్​ చేస్తూ 2025 డిసెంబర్​ 23న కేంద్ర జలశక్తి శాఖకు ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా లేఖ రాశారు. ప్రస్తుతం కమిటీలో ఇప్పుడున్న నలుగురితోపాటు ఇరిగేషన్​ శాఖ జాయింట్​ సెక్రటరీ, ఇంటర్​ స్టేట్​ వాటర్​ రిసోర్సెస్​ వింగ్​ ఎస్‌‌‌‌ఈ, గోదావరి డిప్యూటీ డైరెక్టర్లనూ ప్రతిపాదించారు. 

కమిటీలో మాత్రం తొలి నలుగురికే కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇక, ఏపీ నుంచి వాటర్​ రీసోర్సెస్​ డిపార్ట్‌‌‌‌మెంట్​ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ, అడ్వైజర్​, ఈఎన్సీ జనరల్, ఇంటర్​ స్టేట్​ సీఈలను సభ్యులుగా కేంద్రం నియమించింది. వారితోపాటు కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు, నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ సీఈలను మెంబర్లుగా, సీడబ్ల్యూసీ సీఈని మెంబర్​ సెక్రటరీగా కేంద్రం నియమించింది. 

3  నెలల్లో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కమిటీ సమావేశాలను నిర్వహించనున్నది. సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించనున్నది. న్యాయబద్ధమైన జల పంపిణీకి సూచనలు చేయనున్నది. సమావేశాల్లో భాగంగా సభ్యులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 3 నెలల్లోగా రిపోర్టును సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. 

సమావేశాల సందర్భంగా ఇతర సంస్థలు లేదా డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు చెందిన అధికారులను ఆహ్వానించే అధికారాన్ని కమిటీకి కేంద్రం అప్పగించింది. ఈ సమావేశాలకు అయ్యే ఖర్చును సభ్య రాష్ట్రాలు, డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.