- సెప్టెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించే యోచన
- తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలకు సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్లో తెలిపిన అమిత్ షా
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై కేంద్రం మరోసారి రంగంలోకి దిగనుంది. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ, జలశక్తి శాఖలు కలిసి ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనుంది. సెప్టెంబర్ తొలి వారం లేదంటే ఆ తర్వాత సమావేశాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఈ మేరకు మూడు రోజుల కింద తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్లో ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. జలవివాదాలతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయని, కోర్టు కేసులు, వివాదాలతో లేట్ చేయకుండా చర్చల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
మన స్టాండ్ క్లియర్..
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్లో ప్రాజెక్టులు, నీటి వాటాలపై హాట్హాట్గానే చర్చ జరిగినట్టు చెబుతున్నారు. కృష్ణాలో తమకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని తెలంగాణ మీటింగ్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు అనుమతులను ఇచ్చేయాలని కోరింది. మనకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కు క్లియరెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కర్నాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులను రద్దు చేయాలని కోరింది. ఇటు ఏపీ కూడా తన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు కావాలని కోరింది. దిగువ రాష్ట్రాలకున్న లోయర్ రిపేరియన్ లాభాలను తమకూ వచ్చేలా నీటి వాటాలను సమీక్షించాలని కోరుతున్నది.
