
ఇకపై రూ.5 వేల విలువైన బహుమతులు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ కానివాళ్ల దగ్గర్నుంచి గిఫ్టులు తీసుకునే విషయంలో రూల్స్ను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీ కిందికి వచ్చే ఉన్నతాధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు ఇకపై రూ.5వేల విలువైన గిఫ్టుల్ని అఫీషియల్గా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంతకుముందు ఈ లిమిట్ రూ.1500గా ఉంది. గ్రూప్ సి కిందికొచ్చే క్లర్కులు, ఇతర సిబ్బంది విషయానికొస్తే గిఫ్ట్ విలువ లిమిట్ను రూ.500 నుంచి రూ.2వేలకు పెంచారు. ఆలిండియా సర్వీసుల్లో పనిచేస్తున్నవాళ్లతో సమానంగా కేంద్ర ఉద్యోగుల గిఫ్ట్ సీలింగ్ పరిమితిని సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారిన్ డెలిగేట్స్ నుంచి పొందే గిఫ్టుల విషయంలోనూ వెయ్యి రూపాయల పరిమితిని తొలగించారు. ఫ్రీగా ప్రయాణాలు, హోటళ్లలో బస ఇతరత్రా ప్రయోజనాలను కూడా గిఫ్ట్ కిందే పరిగణిస్తారు. ఆ మేరకు ఉద్యోగులు లెక్కలు చూపాల్సి ఉంటుంది.