2024 లోక్సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తోన్న మూడు హామీలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది. 'హర్ ఘర్ జల్' పథకం ద్వారా దేశమంతటా ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు అందజేయాలని కేంద్రం భావిస్తుంది. నాలుగేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు 67 శాతం కుటుంబాలకు ఇప్పటివరకు కుళాయి నీటి కనెక్షన్లు అందించింది. ప్రస్తుతం దానిని 100 శాతం కవరేజీ చేసే లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఎన్నికల లోపు ప్రతి ఇంటికి నీళ్ల కనెక్షన్ అందించాలని కేంద్రం భావిస్తోంది.
LPG గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించడం కేంద్రం తీసుకోబోయే మరో అడుగు. సిలిండర్ల ధర రూ. 1,100 కంటే ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఘోర అసంతృప్తిగా ఉన్నారు. కర్ణాటక వంటి రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ఓటమికి సిలిండర్ల ధరలు ఒకరకంగా దెబ్బతీశాయని చెప్పాలి. రాజస్థాన్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎల్పిజి సిలిండర్ను రూ. 500కు అందిస్తోంది. మిగిలిన ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఎల్పిజి సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా హామీ ఇచ్చారు. దీంతో సిలిండర్ల ధర ఫోకస్ చేసిన కేంద్రం త్వరలో ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
పిఎం కిసాన్ నిధి కింద రైతులు చెల్లింపులు పెంచాలని కోరుతున్నారనే ఫీడ్బ్యాక్ కేంద్ర ప్రభుత్వానికి అందిందని తెలుస్తోంది. ఈ పథకం కింద కేంద్రం ఒక్కొ రైతుకు రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఇస్తుంది. అయితే గత నాలుగు సంవత్సరాల నుండి ధరల విషయంలో ఎలాంటి మార్పు జరగకపోవడంతో పిఎం కిసాన్ నిధి డబ్బులను పెంచాలనే కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. నకిలీ లబ్ధిదారులను తొలగించడానికి ఆధార్ , బ్యాంకు ఖాతాల అధారంగా ఈ పథకం కింద డబ్బు పొందుతున్న రైతుల సంఖ్య గత 4 సంవత్సరాల్లో సుమారు 11 కోట్ల నుండి 8.8 కోట్లకు పడిపోయింది.