
రైతులు ఆరుగాల కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసి.. ధాన్యాన్ని బస్తాల్లో నింపుకుని.. త్వరలోనే డబ్బులు ఇస్తానని చెప్పి ఉడాయించిన సీఈవోను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి పరారయ్యాడు మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో శ్రీనివాస్. రైతుల ఫిర్యాదుతో ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
మొత్తం 39 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ. 54 లక్షల మేర ఇవ్వకుండా పరారయ్యాడు శ్రీనివాస్. రైతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 3 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. శ్రీనివాస్ ను పార్డి (బి) గ్రామం వద్ద వద్ద పట్టుకున్నారు.
నిందితుడి నుంచి రూ. 9లక్షలు రికవరి చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. నిందితుడు బెట్టింగులకు పాల్పడుతూ జల్సాలకు అలవాటు పడి రైతుల డబ్బులతో ఉడాయించడని భైంసాలో మీడియా సమావేశంలో వెల్లడించారు.