- కొత్త రాతి యుగపు మానవుడు చెక్కిఉంటాడని అంచనా
- పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
- కాపాడుకోవాల్సిన అవసరముందని గ్రామస్తులకు విజ్ఞప్తి
అడ్డాకుల, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం మూసాపేటలో ఆది మానవుడి ఆనవాళ్లు వెలుగు చూశాయని ఆదివారం పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మూసాపేటలోని రామస్వామి గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి ఆయన మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన కొండ శిఖరం పై ఒక బండ పైన కొత్త రాతియుగపు ఎద్దు బొమ్మ రేఖా చిత్రం కనిపించిందని చెప్పారు. ఎద్దు తల, కొమ్ములు, శరీరం, నాలుగు కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ బొమ్మ కింద కొన్ని జంతువులు, మానవుల రేఖా చిత్రాలు కూడా ఉన్నాయన్నారు.
పశు పాలన, వ్యవసాయం ముఖ్య వృత్తిగా గల కొత్త రాతియుగపు మానవుడు తాను రోజూ వాడే రాతి పనిముట్లతో ఆ ఎద్దు బొమ్మను చెక్కివుంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో వెలుగు చూసిన ఇలాంటి ఎద్దు బొమ్మల ఆధారంగా, మూసాపేట రేఖా చిత్రం ఇప్పటికీ 4 వేల సంవత్సరాల నాటిదని, ఎండకు ఎండి, వానకు తడిచి, కొంత స్పష్టత కోల్పోయిందని, పురావస్తు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ ఎద్దు బొమ్మ రేఖా చిత్రాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర శెట్టి, భాస్కర్ గౌడ్, స్థపతి వెంకటరెడ్డి, విశ్వేశ్వర్, కొండయ్య పాల్గొన్నారు.