ఓ మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన శనివారం ఉదయం అంబర్పేటలో కలకలం రేపింది. అంబర్పేట డీడీ కాలనీకి చెందిన భాగవతుల అనసూయ శనివారం ఉదయం తన వదినతో కలిసి నల్లకుంటలో శ్రీలక్ష్మిగణపతి ఆలయానికి వెళ్లింది. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు అనుసూయ మెడలో గొలుసును లాక్కొని పరారయ్యారు.
బాధితురాలు తేరుకునేసరికి అక్కడి నుంచి మాయమయ్యారు. దీంతో మహిళ అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి సీసీ ఫుటేజీ దృశ్యాలను పరిశీలించగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసును డీఐ (డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.