ఐపీఎల్  బెట్టింగ్ ముఠా .. ముగ్గురు అరెస్టు.. పరారీలో ముగ్గురు

ఐపీఎల్  బెట్టింగ్ ముఠా .. ముగ్గురు అరెస్టు.. పరారీలో ముగ్గురు
  • ఐపీఎల్  బెట్టింగ్ ముఠా 
  • ముగ్గురు అరెస్టు.. పరారీలో ముగ్గురు
  • 20 లక్షలు స్వాధీనం, 1.42 కోట్లు ఫ్రీజ్‌‌‌‌
  • 12 ఏండ్లలో రూ.100 కోట్లు పోగొట్టుకున్న పంటర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఐపీఎల్‌‌‌‌ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. హర్యానా కేంద్రంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో జరుగుతున్న బెట్టింగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన ముగ్గురు సబ్‌‌‌‌ బుకీలను చైతన్యపురి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూ.20 లక్షల నగదు,7 సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకుల్లోని రూ.1.42 కోట్లు ఫ్రీజ్  చేశారు. హర్యానాలోని ప్రధాన  బుకీతో పాటు ఏపీకి చెందిన ఇద్దరు బుకీల కోసం గాలిస్తున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌  శనివారం వెల్లడించారు. వనస్థలిపురం వెంకటరమణ కాలనీకి చెందిన జక్కిరెడ్డి అశోక్ రెడ్డి (47) రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌  వ్యాపారం చేస్తున్నాడు. గత12 ఏండ్లలో పంటర్‌‌‌‌  (బెట్టింగ్​లో పాల్గొనేవాడని అర్థం)గా క్రికెట్​లో బెట్టింగ్‌‌‌‌  పెట్టి, దాదాపు రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. అవి తిరిగి సంపాదించాలని సబ్  బుకీ అవతారమెత్తాడు. అతనికి ఏపీకి చెందిన బుకీలు పలాస శ్రీనివాస్‌‌‌‌ రావు, సురేశ్  పరిచయం అయ్యారు. ఆ ఇద్దరికీ అశోక్  రెడ్డి సబ్‌‌‌‌ బుకీగా వ్యవహరించి బెట్టింగులు నిర్వహించాడు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఏడుకుల్ల జగదీశ్‌‌‌‌ రావు (43) అశోక్‌‌‌‌  రెడ్డికి పరిచయమయ్యాడు. జగదీశ్ ను శ్రీనివాస్‌‌‌‌ రావు, సురేశ్ కు అశోక్  పరిచయం చేశాడు. వారంతా హర్యానాలోని ప్రధాన బుకీ విపుల్‌‌‌‌ మోంగాతో కలిసి బెట్టింగ్‌‌‌‌  నిర్వహిస్తున్నారు.

కలెక్షన్ ఏజెంట్‌‌‌‌గా సాఫ్ట్‌‌‌‌వేర్  ఇంజనీర్‌‌‌‌‌‌‌‌

బెట్టింగ్‌‌‌‌  కలెక్షన్ల కోసం కూకట్‌‌‌‌పల్లి భక్తినగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సాఫ్ట్‌‌‌‌వేర్  ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ ఒడుపు చరణ్ (38) పనిచేస్తున్నాడు. విపుల్‌‌‌‌ మోంగా క్రియేట్‌‌‌‌ చేసిన ‘నేషనల్ ఎక్స్చేంజ్9’ ద్వారా జగదీశ్‌‌‌‌ రావు, అశోక్‌‌‌‌ రెడ్డి, చరణ్  హైదరాబాద్‌‌‌‌లో బెట్టింగ్  నిర్వహిస్తున్నారు. ఇందు కోసం చైతన్యపురిలో ఓ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌  జనరేట్‌‌‌‌  చేసి సర్క్యులేట్‌‌‌‌  చేసేవారు. మ్యాచ్‌‌‌‌కు సంబంధించిన సమాచారాన్ని ముందే క్లయింట్లకు పోస్ట్‌‌‌‌  చేసేవారు. మెయిన్‌‌‌‌  బుకీ విపుల్‌‌‌‌  ఆదేశాలతో రేట్లు ఫిక్స్‌‌‌‌  చేసేవారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, గూగుల్‌‌‌‌ పే ద్వారా అమౌంట్‌‌‌‌  కలెక్ట్‌‌‌‌  చేసేవారు. 

ఐపీఎల్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా 3 కోట్ల కలెక్షన్‌‌‌‌

నిందితులు ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌ లో బెట్టింగ్  పెట్టి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశారు. శుక్రవారం కోల్‌‌‌‌కతాలో ‘సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ వర్సెస్‌‌‌‌  కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌’ మ్యాచ్‌‌‌‌ జరగ్గా చైతన్యపురి వాసవి కాలనీలోని బసంతి బొటిక్‌‌‌‌లో బెట్టింగ్‌‌‌‌  నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎల్బీ నగర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌వోటీ, చైతన్యపురి పోలీసులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. జగదీశ్‌‌‌‌ రావు, అశోక్‌‌‌‌ రెడ్డి, చరణ్ లను అరెస్టు చేశారు.