తెలుగు సంవత్సరాల్లో విశ్వావశు నామ సంవత్సరం మరో కొద్ది రోజుల్లో ముగియనుంది. కొత్త సంవత్సరం పరాభవ నామసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం మొదటి మాసం చైత్రమాసం.. మొదటి రోజు ఉగాది పండుగ నుంచి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి రాములోని కళ్యాణం రోజున ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి. చైత్రమాసం వసంత నవరాత్రి ఉత్సవాలగురించి తెలుసుకుందాం. .
చైత్ర మాసం ప్రారంభమవుతూనే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన చైత్ర నవరాత్రులు మొదలవుతాయి. ఈ తొమ్మిది రోజుల పర్వదినాల్లో భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉపవాసాలు చేస్తూ కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రులు వసంత కాలంలో జరగడం వల్ల వసంత నవరాత్రులు అని కూడా పిలుస్తారు. అదే సమయంలో శ్రీరాముడి జన్మదినమైన రామనవమి కూడా ఈ నవరాత్రుల చివరి రోజుల్లో జరుపుకుంటారు.
చైత్ర నవరాత్రుల ప్రారంభం
2026లో చైత్ర నవరాత్రులు మార్చి 19న ప్రారంభమై మార్చి 27 వరకు కొనసాగుతాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:52కు ప్రారంభమై మార్చి 20 ఉదయం 4:52 వరకు ఉంటుంది. అందుకే మార్చి 19న ఘటస్థాపనతో నవరాత్రుల పూజలు ప్రారంభమవుతాయి. అదే రోజు గుడి పాడ్వా పండుగ కూడా జరుపుకుంటారు.
►ALSO READ | బైక్కు లాక్ వేసినా కొన్నిసార్లు దొంగతనాలు.. కానీ రూ.450తో కొని ఈ బ్రేక్ లాక్ వేశారంటే..
ఈసారి వసంత నవరాత్రులు కొన్ని ప్రత్యేక గ్రహస్థితుల మధ్య ప్రారంభమవుతున్నాయి. ప్రతిపద తిథి అమావాస్యతో కలిసే పరిస్థితి ఉండటంతో మొదటి తిథి తక్కువ సమయం ఉంటుంది. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం మొత్తం తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తిగా జరుపుకుంటారు.
ఘటస్థాపన శుభ సమయం
నవరాత్రుల మొదటి రోజున ( మార్చి 19) ఉత్తరాభాద్రపద నక్షత్రం, శుక్ల యోగం కూడా కలిసివస్తున్నాయి. ఈ రోజున కలశ స్థాపన, ఘటస్థాపన వంటి పూజలు చేస్తారు. మార్చి 19న ఉదయం 6:52 నుండి 10:16 వరకు ఘటస్థాపనకు శుభ సమయం ఉంది. ఆ సమయంలో చేయలేకపోతే మధ్యాహ్నం 11:52 నుండి 12:41 వరకు ఉన్న అభిజిత్ ముహూర్తంలో కూడా ఈ పూజ చేయవచ్చు.
దుర్గాదేవి వాహనం
ప్రతి సంవత్సరం వసంత నవరాత్రుల్లో దుర్గాదేవి ఒక ప్రత్యేక వాహనంపై వస్తుందని పురాణ విశ్వాసం. ఆ వాహనం ఆధారంగా ఆ సంవత్సరంలో జరిగే పరిస్థితులను పండితులు అంచనా వేస్తారు. 2026లో దుర్గాదేవి డోలిలో వస్తుందని విశ్వసిస్తున్నారు. పురాణాల్లో దీనిని పల్లకి అంటారు. అమ్మవారు డోలి (పల్లకి) వాహనంపై రావటం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని పండితులు అంటున్నారు.
చైత్ర నవరాత్రి పూజా విధానం
- ఈ నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి.
- మరుసటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్రభాత సమయంలోనే శ్రీరామచందడ్రుని, లలితా దేవిని, పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకోవాలి.
- మొదట గణపతి పూజతో పూజను ప్రారంభించాలి.
- ఆ తర్వాత ఈ నవరాత్రుల్లో ప్రతిరోజూ దేవీ మంత్రాలను జపించాలి. గౌరీ పంచాక్షరీ, బాలా షడాక్షరీ, పంచదశీ, షోడశీ మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే. అత్యంత నియమనిష్ఠలతో ఈ మంత్రానుష్ఠానం సాగించాలి.
- మంత్రము, యంత్రము, తంత్రము అనే మూడూ దేవీ పూజా విధానంలో అత్యంత ముఖ్యమైనవి.
- మంత్రానుష్ఠానం అయిన తర్వాత షోడశోపచారాలతో దేవిని ఆరాధించాలి.
- అనంతరం సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి, ధూపదీప నైవేద్యాలను, తాంబూల నీరాజనాలను సమర్పించాలి.
