హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మృతితో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఆఫీస్కు ఎప్పుడు వెళ్లినా.. తనకు ఆయన స్వాగతం పలికేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేశారని వివరించారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని పిన్నమనేని సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా తన కుటుంబం కోసం కాకుండా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి అని చంద్రబాబు కితాబిచ్చారు. ఆయన కుటుంబానికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత.. పార్టీ అధినేతగా ఆ కుటుంబ పెద్దగా తాను తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాయిబాబా కుటుంబానికి ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో తనకు తీరని ఆవేదన మిగిలిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు.
