
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది. ఏదో ఒక బెంచ్ముందు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరినా.. వచ్చే మంగళవారమే వాదనలు వింటామని సీజేఐ తేల్చి చెప్పారు. మొదట ఈ పిటిషన్ జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి ఉన్న బెంచ్ ముందుకు రాగా.. ఆయన దీన్ని విచారించేందుకు సుముఖంగా లేనంటూ తప్పుకున్నారు. దీంతో ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందు మెన్షన్ చేశారు. చంద్రబాబు కేసును త్వరగా లిస్టు చేయాలని లూథ్రా విజ్ఞప్తి చేశారు.
స్పందించిన సీజేఐ.. అక్టోబర్ 3న విచారిస్తామన్నారు. అప్పటి వరకు చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దని లూథ్రా అభ్యర్థించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్ రంజిత్ కుమార్ అభ్యంతరం చెప్పారు. చట్ట ప్రకారం 15 రోజుల వరకు పోలీస్ కస్టడీ కోరే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ లాయర్ వాదనను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ.. లూథ్రా అభ్యర్థనను తోసిపుచ్చారు. అరెస్టు అక్రమమని, సెక్షన్ 17ఏను పట్టించుకోలేదని లూథ్రా కోర్టుకు విన్నపించినా.. అక్టోబర్ 3నే విచారిస్తామని బెంచ్ స్పష్టం చేసింది.