- దేశం, బార్డర్స్ సురక్షితంగా ఉన్నయ్: రక్షణ మంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మనదేశం, బార్డర్స్ సురక్షితంగా ఉన్నాయని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్లో రాజ్నాథ్ మాట్లాడుతూ.. అగ్నివీరుల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అగ్నివీర్గా రిక్రూట్అయిన వారు నాలుగు ఏండ్ల కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
“సైన్యం యూత్ఫుల్ నెస్ తో ఉండాలి. అగ్నివీర్ ఈ విషయంలో యువత ఎంతో ఉత్సాహంగా ఉన్నారని నేను అనుకుంటున్న. వారి గురించి మేం తగిన జాగ్రత్తలు తీసుకున్నం. వాళ్ల భవిష్యత్తు సురక్షితం. అవసరమైతే మార్పులు చేస్తం” అని అన్నారు. భారత్కు చెందిన భూమిని చైనా ఆక్రమించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను రాజ్ నాథ్ ఖండించారు. మన సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని.. దేశం, సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు. అలాగే ఇండియాను రక్షణ రంగంలో ఇంజిన్లు ఎగుమతి చేసే దేశంగా మార్చాలని ప్రణాళికలు రెడీ చేశామన్నారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఒక గొప్ప ముందడుగని తెలిపారు. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఆర్డీవోకు సూచించానని రక్షణ మంత్రి పేర్కొన్నారు.