చెన్నపట్టణ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనుందనే భయం దేశ ప్రజల్లో కల్లోలం రేపుతోంది. ఈ క్రమంలోనే.. కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ దొంగతనం ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని చెన్నపట్టణలో ఉన్న కనకనగర్లో క్రిష్ణప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఇంటి కాంపౌండ్ లోపల ఉన్న సిలిండర్ను ఒక దొంగ చోరీ చేసిన ఘటనతో స్థానికులు విస్తుపోయారు.
అసలే.. గ్యాస్ కొరత ఉందనే ప్రచారంతో ప్రజల్లో ఇప్పటికే టెన్షన్ నెలకొని ఉంది. ఇలాంటి ఘటనలతో జనం మరింత బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో భారత్లో ఇంధన కొరత నెలకొన్నది. హార్మూజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.
బెంగళూరు, చెన్నై, ముంబైల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే స్థితికి వచ్చాయి. దీంతో ఆయా అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. అలాగే, దేశీయ ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నది.
దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ), సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చమురు కంపెనీలపై ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్’ (ఎస్మా)ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ అవసరాలు, రవాణా రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది.
