
వెన్నెల కిశోర్ హీరోగా టీజీ కీర్తికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నా మొదటి చిత్రం ‘మళ్లీ మొదలైంది’లో వెన్నెల కిశోర్ కమెడియన్గా నటించారు. అప్పుడే ‘చారి 111’ స్టోరీ ఐడియా చెప్పాను. పింక్ పాంథర్, జానీ ఇంగ్లీష్ లాంటి హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. ఆ సినిమాలంటే నాకిష్టం.
కిశోర్ గారికి నేను ఫ్యాన్ కనుక ఆయన్ను మనసులో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ రాశా. ఆయన 'నో' అంటే ఇది మొదలయ్యేది కాదు. స్పై యాక్షన్తో కూడిన కామెడీ సినిమా ఇది. చిరంజీవి గారి ‘రుద్రనేత్ర’ చిత్రం స్ఫూర్తితో మా స్పై ఏజెన్సీకి అదే పేరు పెట్టాం. అలాగే ‘చంటబ్బాయ్’ పాత్ర తరహాలో ఇందులో హీరో స్పై రోల్ ఉంటుంది. ఓ దర్శకుడిగా యాక్షన్ సినిమాలు చేయాలనుంది. దానికి ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ఇది తీశా. దీనికి సీక్వెల్ ప్లాన్ కూడా ఉంది’ అని చెప్పాడు.