
- వెరిఫికేషన్ ప్రాసెస్ను చూసుకుంటున్న థర్డ్ పార్టీ కంపెనీలు
- అకౌంట్ ఓపెన్ అయ్యాక మానిటరింగ్ కూడా..
- 10 ట్రేడ్లలో 9 ప్రాఫిటబుల్ అయితే బ్రోకరేజీలకు వార్నింగ్!
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా మంది ఆలోచిస్తుంటారు. ప్రతీ ఒక్కరికి అకౌంట్ ఇస్తారా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వంటివి చూడరా? అని ప్రశ్నలు వేసుకుంటారు. కానీ, అకౌంట్ ఓపెనింగ్ కోసం జెరోధా లేదా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వంటి బ్రోకరేజీలకు ఇచ్చిన డిటెయిల్స్ను థర్డ్ పార్టీ కంపెనీలు వెరిఫై చేస్తాయి. అది కూడా కేవలం 300 మిల్లీ సెకెండ్లలోనే ప్రాసెస్ పూర్తి చేస్తాయి. ముంబైకి చెందిన టీఎస్ఎస్ కన్సల్టన్సీ సర్వీసెస్ కంపెనీ ఇలాంటి సర్వీస్నే మెజార్టీ బ్రోకరేజీ కంపెనీలకు అందిస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో జరుగుతున్న టర్నోవర్లో 70 శాతం బ్రోకరేజీలకు ఈ కంపెనీ సర్వీస్లు అందిస్తోంది. టీఎస్ఎస్ కన్సల్టన్సీ సర్వీసెస్ను అన్నదమ్ములు సాగర్, సమీర్ తన్నా 2008 లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్లాట్ఫామ్ ట్రాక్విజ్ క్లయింట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ను చూసుకుంటోంది. మన లాంటి పెద్ద దేశంలో ఫైనాన్షియల్ క్రైమ్స్ను గుర్తించడం, ఆపడం చాలా కష్టమని సాగర్ తన్నా పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ టెక్ కంపెనీగా ఈజీగానే మారామని చెప్పారు.
180 రకాల లిస్ట్లను చూసి..
యాంటీ మనీలాండరింగ్ (ఏఎంఎల్) సొల్యూషన్ ఫీచర్ కింద ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ను ట్రాక్విజ్ వెరిఫై చేస్తుంది. 180 రకాల లిస్ట్లలో వీరి పేర్లు ఉన్నాయో లేదో చూస్తుంది. సెబీ బ్యాన్ చేసిన కంపెనీల, వ్యక్తుల లిస్ట్, బ్లాక్లిస్ట్లో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్ల లిస్ట్, ఆంక్షలు ఎదుర్కొంటున్న వారి లిస్ట్ ఇలా వివిధ రకాల లిస్టులలో వ్యక్తి పేరు ఉందో లేదో చూస్తుంది. వైల్డ్లైఫ్ నేరాలకు పాల్పడిన వారి లిస్ట్ను కూడా చెక్ చేస్తుంది. ఈ వెరిఫికేషన్లో క్లియరెన్స్ వచ్చాక, ఆ వివరాలను బ్రోకరేజీకి పంపుతుంది. అప్పుడు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన వారి రిస్క్ ప్రొఫైల్ను కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఆ వ్యక్తి లో, మీడియం, హై రిస్క్లో ఉన్నాడో చెబుతుంది. ఉదాహరణకు నిజామాబాద్లోని వ్యక్తి తన ఆక్యుపేషన్ను వ్యవసాయం అని డిక్లేర్ చేస్తే అతనికి లో రిస్క్ ప్రొఫైల్ను ఇవ్వొచ్చు. అదే హైదరాబాద్లోని వ్యక్తి తన ఆక్యుపేషన్ వ్యవసాయం అని డిక్లేర్ చేస్తే అతనికి హై రిస్క్ ప్రొఫైల్ను ఇవ్వొచ్చు.
ట్రాక్విజ్ ఏ రిస్క్ ప్రొఫైల్ ఇచ్చిందో అకౌంట్ ఓపెన్ చేసేవారికి తెలీదు. బ్రోకరేజీ కంపెనీలు ఈ రిస్క్ ప్రొఫైల్స్ను బట్టి కాల్స్, మరిన్నీ చెకింగ్స్ చేసుకోవాలో లేదో నిర్ణయం తీసుకుంటాయని సాగర్ పేర్కొన్నారు. ఏఎంఎల్ సొల్యూషన్లో ట్రాన్సాక్షన్ మానిటరింగ్ ఫీచర్ కూడా ఉంది. అకౌంట్ క్రియేట్ అయ్యాక ఈ ఫీచర్తో ట్రాక్విజ్ మానిటర్ చేస్తుంది. ట్రేడింగ్ యాక్టివిటీలో అసాధారణమైన ప్యాటర్న్స్ గుర్తిస్తే బ్రోకరేజీలకు చెబుతుంది. అంటే లిక్విడిటీ లేని ఆప్షన్స్లో తరచూ ట్రేడ్ చేయడం వంటివి చెక్ చేస్తుంది. క్లయింట్కు ప్రతి 10 ట్రేడ్లలో తొమ్మిది ట్రేడ్లు లాభాలొస్తే సిస్టమ్ వెంటనే అలర్ట్ పంపుతుంది. సెబీ స్టడీనే ప్రతీ పది ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో తొమ్మిది మంది నష్టపోతున్నారని చెబుతోందని సాగర్ గుర్తు చేశారు.