
నేటి సమాజంలో ప్రజలు తాము చేసే పనిలో నిమగ్నమై తీరిక లేకుండా ఉండడం వలన భోజనం చేసేందుకు హోటల్స్, మెస్సులు, ఇతర వ్యవస్థల ద్వారా కష్టం లేకుండా సులభంగా ఆహార పదార్థాలను పొందేందుకు అలవాటుపడిపోతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర వ్యవస్థలలో ఆహార భద్రతపై స్థానిక సంస్థల అధికారులు పర్యవేక్షణ, తనిఖీలు చేయడంవలన వాటిలో శుభ్రత, నాణ్యత లేని పదార్థాలు ద్వారా ఆహారం తయారు చేస్తున్నారని తెలుస్తున్నది.
లెక్కలేనన్ని హోటల్స్, రెస్టారెంట్లు,కర్రీ పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి. కానీ, అన్ని చోట్లా స్థానిక సంస్థల అధికారులు తనిఖీలు చేస్తున్నారా అనే అనుమానం ఉంది. శుభ్రత లేని ఆహారం తీసుకుంటున్నవారు అనారోగ్యానికి గురవుతున్నారు. సామాన్యులు ఎక్కువగా హోటల్స్, కర్రీ పాయింట్లపై ఆధారపడుతుంటారు. బయటి ఆహారం తీసుకోవడం ఈ కాలంలో అనారోగ్యాన్ని కోరి కొనితెచ్చుకుంటున్నట్లుంటుంది.
బయటి ఆహారం ఒక అనివార్యంగా మారిపోతున్న కాలమిది. కాబట్టి హోటల్స్, కర్రీ పాయింట్లపై నిరంతరం తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. వాటిలో వండే కూరలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను తయారుచేసే విధానంలో శుభ్రత పాటిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి. వీటి విక్రయాల ధరల పట్టికలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
ఇందులో ఉపయోగించే నూనె ఇతర పదార్థాలు సరియైన నాణ్యత పరిమాణాలు పాటిస్తున్నారా అనే సంశయం కలుగుతున్నది. ఈ కర్రీ పాయింట్లలో ఎప్పుడు చూసినా గిన్నెల నిండా కూరలు, పప్పులు నిల్వగా కనిపిస్తుంటాయి. వీటిని ఎప్పుడు తయారు చేశారో అనే అనుమానం కలుగుతుంది. ప్రజలకు నాణ్యమైన పప్పులు, కూరలు అందించుటకు ఆహార భద్రత కోసం స్థానిక సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు, పర్యవేక్షణలు చేయాలి. సరసమైన ధరలకు నాణ్యతతో కూడిన పదార్థాలు ప్రజలు పొందేలా అధికారులు చర్చలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇది ప్రజారోగ్యానికి సంబంధించినదనే విషయం ప్రభుత్వం మరిచిపోవద్దు.
- దండంరాజు రాంచందర్ రావు–