- సదరన్ కమాండ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ను హైదరాబాద్కు మార్చండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లు మంజూరు చేశారు. గత పదేండ్లలో తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదు. రాష్ట్రంలో తక్షణమే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి” అని విజ్ఞప్తి చేశారు. ఆర్మీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెండింగ్లో ఉన్న భూసమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.
దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, ఆర్మీకి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే వికారాబాద్ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ వీఎల్ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్కు 3 వేల ఎకరాలు కేటాయించినట్టు గుర్తు చేశారు.ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, తెలంగాణ–ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీస ర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
