ఐదు రోజుల పసికందు అమ్మకం

ఐదు రోజుల పసికందు అమ్మకం

నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో  పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు.  నిర్మల్​లోని శాంతినగర్ కు చెందిన గొట్పటి అర్చన, శేఖర్ దంపతులకు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉండగా.. ఐదు రోజుల కింద మరో పాప జన్మించింది.  ఈ క్రమంలో మరో పాపను ఎలా పెంచి పోషించాలో తెలియక సతమతమయ్యారు.  ఈ  సమాచారాన్ని  తెలుసుకున్న  నరేశ్​ అనే వ్యక్తి అర్చన, శేఖర్ దంపతులతో  పాపను  విక్రయించేందుకు  ఒప్పందం కుదిర్చాడు. సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన కప్లై సంజీవ్, గంగమణి అనే దంపతులు సంతానం లేక  చాలా రోజుల నుంచి బాధపడ్తున్నారు.

ఈ విషయాన్ని  తెలుసుకున్న నరేశ్​  పసిపాపను అమ్మేందుకు  మధ్యవర్తిత్వం చేశాడు.  దీంతో పాప తల్లిదండ్రులకు రూ.2.5లక్షలను సంజీవ్​ దంపతులు  చెల్లించారు. అయితే  రెండ్రోజుల కింద వీరు ఆ పాపకు బారసాల చేయడంతో స్థానికులు అనుమానించి చైల్డ్​ ప్రొటెక్షన్​ కమిటీకి సమాచారం అందించారు.  బుధవారం కమిటీ సభ్యులు జామ్ గ్రామానికి చేరుకొని పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు, షీ టీంతో పాటు చైల్డ్​ ప్రొటెక్షన్​ కమిటీ సభ్యులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పాపను చైల్డ్​ ప్రొటెక్షన్​ కమిటీ సభ్యులు పోలీసులతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లకు అప్పజెప్పారు.  అర్చన, శేఖర్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ పురుషోత్తమాచారి తెలిపారు. నరేశ్​పై విచారణ చేస్తున్నామన్నారు.