కారా సంస్థతో దత్తతకు చాన్స్..అవగాహన లోపం,ఆపై ఆలస్యం

కారా సంస్థతో దత్తతకు చాన్స్..అవగాహన లోపం,ఆపై ఆలస్యం

వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ప్రభుత్వం శిశుగృహాలు, బాలసదన్‌‌లలో ఆశ్రయం కల్పిస్తోంది. వీటిలో పెరుగుతున్న పిల్లలను లీగల్‌‌గా దత్తత ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా కారా (సెంట్రల్‌‌ అడాప్షన్‌‌ రిసోర్స్ అథారిటీ) అనే సంస్థ పని చేస్తోంది. ఇందులో అప్లికేషన్‌‌ పెట్టుకుంటే ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలనైనా దత్తత తీసుకోవచ్చు. ఇందుకు ముందుగా దంపతుల ఫొటో, మ్యారేజ్‌‌ సర్టిఫికెట్‌‌, వయసు, పాన్‌‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌‌ కార్డులను ‘కారా’ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

పిల్లలను పెంచుకునేందుకు సరిపడా ఆదాయం ఉన్నట్లు ఇన్‌‌కం సర్టిఫికెట్‌‌ సైతం సమర్పించారు. అప్లికేషన్‌‌ టైంలోనే ప్రభుత్వానికి రూ.6 వేలు డీడీ చెల్లించడంతో పాటు దత్తత తీసుకునే టైంలో మరో రూ.50 వేలు డీడీ కట్టాలి. దత్తత ముగిసిన తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి డిస్ట్రిక్ట్‌‌ చైల్డ్‌‌ ప్రొటెక్షన్‌‌ ఆఫీసర్లు ఇంటికొచ్చి పిల్లల బాగోగుల గురించి ఆరా తీస్తారు. ఇలా రెండేండ్ల కాలంలో నాలుగు సార్లు ఫీల్డ్‌‌ వెరిఫై చేయనుండగా, ప్రతి విజిట్‌‌ సందర్భంగా సదరు పేరెంట్స్ రూ.2 వేల చొప్పున డీడీ చెల్లించాలి.

ఇంటర్‌‌ కంట్రీ అడాప్షన్‌‌తో ఇతర దేశాలకు...

కారా వెబ్‌‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకుంటే ఇతర దేశాల్లో ఉన్న వారు సైతం ఇక్కడి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇంటర్‌‌ కంట్రీ అడాప్షన్‌‌ పేరుతో పిల్లలను ఇతర దేశాలకు దత్తత ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 224 మంది పిల్లలను దత్తత ఇవ్వగా.. అందులో 12 మంది చిన్నారులను ఇటలీ, మాల్టా, యూకే, యూఎస్‌‌ఏ వంటి దేశాలకు చెందిన దంపతులకు ఇచ్చారు. ఇంకా హనుమకొండలోని శిశుగృహలో 8 మంది, బాలసదన్‌‌లో 30 మంది చిన్నారులు దత్తత కోసం ఎదురుచూస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు ఉన్నారు.

అవగాహనాలోపం.. ఆపై ఆలస్యం..

కారా వెబ్‌‌సైట్‌‌లో అప్లికేషన్‌‌ చేసుకోగానే ఆ వివరాలన్నీ సంబంధిత జిల్లా ఆఫీసర్లకు చేరుతాయి. వాటి ప్రకారం డిస్ట్రిక్ట్‌‌ వెల్ఫేర్‌‌ ఆఫీసర్లు ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ చేసి, వివరాలను ధ్రువీకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తులదారుల వయసును బట్టి సంబంధిత జిల్లా శిశుగృహ, బాలసదన్‌‌లో ఉన్న పిల్లల దత్తతకు ‘కారా’ అంగీకరిస్తుంది. అనంతరం కలెక్టర్‌‌ సమక్షంలో పిల్లలను దంపతులకు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి రెండు, మూడేండ్లకు మించి సమయం పడుతోంది. 

పిల్లలతో దళారుల అక్రమదందా

చట్టబద్ధ దత్తతకు చాలా సమయం పడుతుండడంతో దళారులు ఎంటర్‌‌ అవుతున్నారు. దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగుచూసింది. సూర్యాపేటకు చెందిన యాదగిరి- ఉమారాణి దంపతులు ముంబై, గుజరాత్‌‌కు చెందిన ముఠాల ద్వారా పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. వారు వివిధ ప్రాంతాల నుంచి 28 మంది చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మినట్లు తేలింది. పోలీసులు 10 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. శిశువిక్రయదందాకు పాల్పడిన 13 మందిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. దళారులను నమ్మి చిన్నారులను తీసుకున్న దంపతులు సైతం ఓ వైపు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మరో వైపు కేసుల పాలుకావాల్సి వస్తోంది.