
కోహెడ (బెజ్జంకి), వెలుగు: పచ్చటి పందిట్లో మేళతాళాల మధ్య జరగాల్సిన పెళ్లి ఆఫీసర్ల రాకతో ఆగిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయిని ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఇరుకుటుంబాలు సంబంధం కుదుర్చుకున్నారు. బుధవారం పెళ్లి జరుగుతుండగా ఆకస్మాత్తుగా తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎస్సై చంద్రశేఖర్, ఎంపీడీవో రాఘవేందర్రెడ్డి, ఐసీడీఎస్ సిబ్బంది శోభ, భారతి అక్కడికి వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. అమ్మాయికి 18 ఏళ్లు పూర్తి కాలేదని 100 నంబర్కు ఫోన్ వచ్చిందని చెప్పడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.