
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో యదేచ్చగా... అక్రమంగా విదేశస్థులు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయి సంపాదిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా, రేణిగుంటలో చైనా జాతీయుడి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. డ్యూయాంగన్ అనే వ్యక్తి "బిగ్ కిచెన్" పేరుతో చైనా కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆహారం సరఫరా చేస్తూ వ్యాపారంకొనసాగిస్తున్నాడు.
డ్యూయాంగన్ వీసా నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం, వివిధ కంపెనీల పేరుతో వ్యాపారాలు నిర్వహించడం వంటి అంశాలపై అనుమానాలు రావడంతో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన ఈడీ అధికారులు రేణిగుంటకు చేరుకుని అతని నివాసంలో సోదాలు జరిపారు.
►ALSO READ | శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం.. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం.. రాతి నాగశిలలతో ఆలయంలోకి భక్తులు
డ్యూయాంగన్కు సంబంధాలున్న కంపెనీలను, ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఏర్పేడు మండలం వికృతమాలలో అతను నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్లో కూడా సోదాలు నిర్వహించారు. రేణిగుంటలోని అతడి ఇంటికి బ్యాంకు అధికారులను పిలిపించి విచారణ జరిపినట్లు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉండగా.. డ్యూయాంగన్ ను 2021లో రేణిగుంట పోలీస్స్టేషన్లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ, అనధికారిక నివాసం వంటి అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఆ సమయంలో పోలీసులు అతని పాస్పోర్టును సీజ్ చేసి తిరుపతి కోర్టుకు అప్పగించారు. అప్పటి నుంచి డ్యూయాంగన్ రేణిగుంటలోనే ఉండి కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు సోదాలు జరిపారు