- తండ్రితో బైక్పై వెళ్తుండగా ప్రమాదం
ఎల్బీనగర్, వెలుగు: చైనా మాంజా గొంతుకు చుట్టుకుని 20 నెలల బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముండే తాటిశ్యామ్, త్రివేణి దంపతుల కుమారుడు అంజన్ కుమార్ (20 నెలలు)తో సాయంత్రం వనస్థలిపురంలో కూరగాయలు కొనేందుకు బైక్పై వెళ్తున్నారు. మాన్సూరాబాద్ పోచమ్మ దేవాలయం వద్దకు రాగానే బైక్ పై ముందు కూర్చున్న బాలుడి గొంతుకు చైనా మాంజా తగిలి గొంతు కోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన తండ్రి బాలుడి గొంతుకు చేయి అడ్డంగా పెట్టడంతో అతని చేయి కూడా కోసుకుపోయింది. బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో దగ్గరలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కొత్తపేటలోని పారమిత చిల్ర్డన్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలో చైనా మాంజా నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది అక్రమంగా నగరంలో మాంజా అమ్ముతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి డిమాండ్ చేశారు.