- టన్ను డ్రాగన్ ఉక్కు ధర రూ.3,108 వరకు చౌక
న్యూఢిల్లీ: చైనా స్టీలు దిగుమతులు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మనదేశానికి డ్రాగన్ ఉక్కు ఎగుమతులు రెండింతలు పెరిగాయి. గత రెండేళ్లలో ఇవి అత్యధికం స్థాయికి చేరడం భారతీయ స్టీల్కంపెనీలను టెన్షన్పెడుతోంది. దిగుమతి సుంకాలు ఉన్నా పొరుగుదేశ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లను ముంచెత్తుతాయి.
చైనా ఏప్రిల్లో సుమారు 2.32 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కును సరఫరా చేసింది. భారత్కు అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశంగా ఎదిగింది. ఇరాన్ యుద్ధం కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత ఏర్పడింది. దీంతో మనదేశంలోని చిన్న ఉక్కు కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనా దూకుడు కొనసాగుతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పాదక దేశమైన భారత్ కొన్ని రకాల స్టీల్దిగుమతులపై మూడేళ్ల వరకు సుంకాలు విధించింది. ఇవి చైనా దిగుమతుల వేగాన్ని తగ్గించగలిగినప్పటికీ, ప్రస్తుత పెరుగుదలను అడ్డుకోలేకపోయాయి.
స్టెయిన్లెస్ స్టీలుకు మినహాయింపు
చైనా నుంచి భారత్కు వచ్చిన ఉక్కు ఉత్పత్తులలో ప్రధానంగా హాట్-రోల్డ్ కాయిల్స్ , స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు ఉన్నాయి. హాట్-రోల్డ్ కాయిల్స్పై దిగుమతి సుంకాలు వర్తిస్తున్నప్పటికీ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులకు మినహాయింపు ఉంది. చైనా నుంచి తక్కువ ధరకు వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ దేశీయ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిందని జిందాల్ స్టెయిన్లెస్ సీఈఓ తరుణ్ ఖుల్బే తెలిపారు.
కొన్ని దిగుమతులు భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న వియత్నా వంటి ఆసియాన్ దేశాల నుంచి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్లో భారత్కు భారీగా ఉక్కు ఎగుమతి చేసిన మొదటి ఐదు దేశాలలో వియత్నాం నిలిచింది. దీని షిప్మెంట్లు నాలుగు రెట్లు పెరిగి 59 వేల టన్నులకు చేరాయి. ఇటువంటి దిగుమతులు మన దెబ్బతీస్తున్నాయని, పరిశ్రమ పెట్టుబడులపై, దీర్ఘకాలిక ఉత్పాదక పోటీతత్వంపై ప్రభావం చూపుతున్నాయని ఖుల్బే ఆందోళన వ్యక్తం చేశారు.
తక్కువ ధరే కారణం
స్థానిక ధరలతో పోలిస్తే చైనా హాట్-రోల్డ్ ఉక్కు టన్నుకు 11 డాలర్లు (సుమారు రూ.924 ) నుంచి 37 డాలర్లు (సుమారు రూ.3,108 ) వరకు చౌకగా లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా మిడిల్ఈస్ట్ దేశాలకు చేరలేకపోయిన సరుకులు భారత్కు వచ్చాయి. గత నెలలోనూ కూడా చైనా దిగుమతులు మరింత పెరిగి ఉండవచ్చని కమోడిటీస్ కన్సల్టెన్సీ బిగ్మింట్ అంచనా వేసింది.
గత నెలల్లో సుంకాల వల్ల దిగుమతులు తగ్గినప్పటికీ ఏప్రిల్లో భారత్ నికర దిగుమతిదారుగా మారింది. 2026 ఆర్థిక సంవత్సరంలో చైనా ఉక్కు ఎగుమతులు భారత్కు 39.4 శాతం తగ్గి 1.5 మిలియన్ టన్నులకు చేరాయి. అప్పుడు మనదేశం నికర ఎగుమతిదారు! మౌలిక సదుపాయాలు, ఆటో రంగాల నుంచి ఉక్కుకు డిమాండ్ పెరుగుతోంది. ఏప్రిల్లో ఉక్కు వినియోగం 8.2 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరింది.
