
చెన్నై: ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో మంగళవానం ఉదయం చనిపోయారు. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్ స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. బొమ్మలు గీయడంలోనే కెరియర్ను వెతుక్కోవాలని భావించిన ఈశ్వర్ కాకినాడలో చదువుతున్న పాలిటెక్నిక్ చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి మద్రాస్ కు చేరుకున్నారు. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్ లో మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత తన పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీ ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన సాక్షి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో పబ్లిసిటీ పనులు ప్రారంభించారు. ఆ సినిమా కోసం కలర్ పోస్టర్లు, లోగో తయారు చేశారు. పాప కోసం సినిమాకు బ్రష్ తో కాకుండా, నైఫ్ వర్క్తో పోస్టర్లు రూపొందించి గుర్తింపు పొందారు. హిందీ, తమిళ వెర్షన్లకూ అలాంటి పోస్టర్లే రూపొందించారు. ఉత్తమ చలన చిత్ర పుస్తక విభాగంలో ఆయన రాసిన పుస్తకానికి నంది అవార్డ్ దక్కింది. ఈశ్వర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.