
న్యూఢిల్లీ, వెలుగు: సమగ్ర నివేదిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సేకరించిన పౌరుల వ్యక్తిగత డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ నే ఓ కార్యక్రమంలో ’సిటిజన్360’ ద్వారా సేకరించిన వివరాలు తెలిపారన్నారు. గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. డేటా (గోప్యత – రక్షణ) చట్టం–2017, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2008లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లఘించారని ఫిర్యాదు చేసినట్లు శ్రావణ్ తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కేంద్రం విచారణ జరపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.