- హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
- సిటీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో 268 మంది మహిళలకు శిక్షణ
హైదరాబాద్,వెలుగు : ప్రజా భద్రతలో పోలీసులు వృత్తి ధర్మాన్ని కాపాడాలని సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. శారీరక,మానసిక శక్తి కోసం ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. ఇతర డిపార్ట్మెంట్స్లోని ఉద్యోగులు టైమ్కి డ్యూటీలు ముగించుకుని ఇండ్లకు వెళ్తారు.. కానీ పోలీసులు మాత్రం ప్రజల రక్షణకు 24 గంటలు కృషి చేయాలని పేర్కొన్నారు.
కొత్తగా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు పేట్లబురుజులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభమైంది. సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్, సిద్దిపేట యూనిట్లకు చెందిన268 సివిల్,ఆర్మ్ డ్ రిజర్వ్ మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు,17 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, మెకానిక్లు 9 నెలల బేసిక్ ఇంక్షన్ ట్రైనింగ్ పొందనున్నారు. వీరికి సీపీ శ్రీనివాస్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు.
సర్వీస్ కాలంలో ప్రజలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో డ్యూటీలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ(కార్ హెడ్ క్వార్టర్స్ ) వి. సత్యనారాయణ సహా ట్రైనింగ్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.