
- డ్రోన్లు, హై రిజల్యూట్కెమెరాలతో ట్రాఫిక్ పర్యవేక్షణ
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సమస్య
- నివారణకు ఓనర్లతో సమావేశం
- సమీక్షా సమావేశంలో కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ‘ట్రాఫిక్ మార్షల్’ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మార్షల్స్ను నియమించి, వారికి శిక్షణ ఇస్తామని సిటీ సీపీ సీవీ ఆనంద్వెల్లడించారు.
ట్రాఫిక్ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ట్రాఫిక్ జాయింట్సీపీ జోయల్తో కలిసి శుక్రవారం కమాండ్ కంట్రోల్సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ గతేడాది నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 17 నుంచి -18 కిలోమీటర్లుండగా, ప్రస్తుతం 24-–25 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. ప్రతిరోజూ సుమారు 1,600 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, మూడు కమిషనరేట్ల పరిధిలో రోజుకు 91 లక్షల వాహనాలు తిరుగుతున్నాయన్నారు.
ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్) ద్వారా మంచి ఫలితాలు సాధించామని, దీనిని మరింత శాస్త్రీయ పద్ధతిలో బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీఐపీల రాకపోకల వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం ఆదేశాల మేరకు వీఐపీ ప్రయాణ సమయాల్లో ట్రాఫిక్ను ఎక్కువసేపు నిలపకుండా చూస్తున్నామన్నారు. నగరంలో 80 శాతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ క్లియరెన్స్ వేగవంతమైందన్నారు.
డ్రోన్ కెమెరాలు, గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీతో ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నామని, 25 ఎత్తయిన భవనాలపై హై రిజల్యూషన్కెమెరాల ద్వారా ‘ఈగల్ వ్యూ’ సేకరిస్తున్నామన్నారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ సమస్యలను ముందస్తుగా గుర్తించి, స్థానిక అధికారులకు సమాచారం అందించడంలో సహాయపడతాయన్నారు.
ట్రాన్స్జెండర్లు సూపర్గా పని చేస్తున్నరు
ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు చక్కగా డ్యూటీలు చేస్తున్నారని, ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, రాబోయే రోజుల్లో మరిన్ని నియామకాలు చేపడతామని సీపీ ఆనంద్తెలిపారు. నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల కలిగే అవాంతరాలను నియంత్రించేందుకు వాటి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్తీసుకుంటామన్నారు. ఈ వర్షాకాలంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్జాయింట్ సీపీ జోయల్ డేవిస్ , ట్రాఫిక్ డీసీపీలు రాహుల్హెగ్డే, అశోక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.