- కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్తో చర్చలు
- అందరూ ఇండ్లకు వెళ్లాలని ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కేంద్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలన్నింటికీ కోటి రూపాయల చొప్పున పరిహారం అందించడం, ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు మరో రెండు డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు.
మంత్రులతో మూడో విడత చర్చల అనంతరం, కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించిందని, అందుకే నిరసనను విరమిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘36 రోజుల నిరసనల తర్వాత ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ అంగీకరించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వెనక్కి వెళ్లాలని మేం కోరుతున్నాం’’ అని రంకా తెలిపారు.
‘‘నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని నడ్డా వెల్లడించారు. నీట్ ఆత్మహత్య బాధితుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. అయితే ఆ మొత్తం ఎంతనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. కాగా, మంత్రులతో సీజేపీ ప్రతినిధుల
చర్చలకు కొద్దిసేపటి ముందే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
- సీజేపీ డిమాండ్ల జాబితా అప్డేట్
కేంద్రం తమ డిమాండ్లకు అంగీకరించిందని, అయితే మరో 3 డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని సీజేపీ శనివారం ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఖాతాలో అప్డేటెడ్ జాబితాను రిలీజ్ చేసింది. ‘ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి’ అనే డిమాండ్ వద్ద టిక్ మార్క్ పెట్టింది. ‘నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ల కుటుంబాలకు రూ.
కోటి పరిహారం’, ‘విద్యార్థి నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు’.. అనే డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. అలాగే, కొత్తగా ‘ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసుల బహిరంగ క్షమాపణ’ డిమాండ్ను కూడా చేర్చి, అది కూడా పెండింగ్లో ఉన్నట్టుగా పేర్కొంది. ఈ డిమాండ్ల కోసం యావత్ దేశం ఎదురుచూస్తోందని కామెంట్ చేసింది.
