
న్యూఢిల్లీ: ఓవైపు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. మరోవైపు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం రెడీ అవుతున్న యంగ్ టీమిండియా.. ఈ నేపథ్యంలో ఇండియా బ్యాటింగ్ లైనప్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. బ్యాటింగ్ ఆర్డర్పై కొద్దిగా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా కోహ్లీ రిటైర్మెంట్తో ఏర్పడిన నాలుగో నంబర్ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారనే చర్చకు ఫుల్స్టాప్ పెట్టాడు. లీడ్స్లో జరిగే తొలి మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో నంబర్లో బ్యాటింగ్కు దిగుతాడని స్పష్టం చేశాడు.
ఓపెనర్ నుంచి..
మొత్తానికి ఇంగ్లండ్తో సిరీస్ నుంచి టీమిండియా లైనప్ నిర్మాణం పూర్తిగా మారనుంది. జట్టులోకి వచ్చినప్పుడు గిల్ ఓపెనర్గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే యశస్వి జైస్వాల్ రాకతో ఓపెనింగ్ను వదిలి మూడో ప్లేస్లో ఆడాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా రావడంతో నాలుగో నంబర్కు దిగాడు. మొత్తానికి బలమైన మిడిలార్డర్ను నిర్మించాలనే ఉద్దేశంతో గిల్ను కిందకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐదో ప్లేస్లో యధావిధిగా రిషబ్ పంత్ను కొనసాగించనున్నారు. అయితే మూడో నంబర్లో ఎవరు ఆడతారనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని పంత్ వెల్లడించాడు.
గెలుపే లక్ష్యంగా..
రెడ్ బాల్ క్రికెట్లో టీమిండియా కోర్ బ్యాటింగ్ లైనప్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే 2007 నుంచి ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. గత పదేళ్లుగా రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్ పోరాడినా విజయాలు మాత్రమే దక్కాయి. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్ను నెగ్గాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
2021లో సిరీస్ గెలిచే అవకాశం వచ్చింది. కానీ 2–1 లీడ్లో ఉన్న దశలో కొవిడ్ కారణంగా ఐదో టెస్ట్ను వాయిదా వేశారు. 2022లో జరిగిన సిరీస్లో ఓటమిపాలయ్యాం. దీంతో టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ పేరుతో రీ బ్రాండ్ అయిన ఇంగ్లండ్ సిరీస్ను కొత్తగా మొదలుపెట్టాలని యంగ్ టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఈ సిరీస్ కోసం కొత్త కెప్టెన్ గిల్తో పాటు రాహుల్, పంత్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్లో ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులను ఆస్వాదిస్తూనే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ కండిషన్స్లో ఆడేందుకు రాహుల్ బాగా కష్టపడుతున్నాడు. పాత జట్టులో నుంచి రవీంద్ర జడేజా, బుమ్రా కూడా ఈ సిరీస్లో తామేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
కొత్త నాయకత్వం, అనుభవం, యువరక్తంతో ఈ సిరీస్పై తమదైన ముద్ర వేయాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ‘డ్యూక్ బాల్, అది నంబర్వన్. ఎల్లప్పుడూ మారుతూ ఉండే వాతావరణం, అది ఉత్తేజకరమైనది, కఠినమైనది. అలాగే ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుంది’ అని గిల్ వ్యాఖ్యానించాడు. ఇక్కడ టెస్ట్ క్రికెట్ ఆడటం తనను బాగా ఉత్తేజపరుస్తుందని రాహుల్ అన్నాడు.
ఇంగ్లిష్ వేసవి మనం అనుకున్న దానికంటే భిన్నంగా ఉంటుందన్నాడు. సూర్యుడు బయటకు వస్తే గొప్ప క్రికెట్ ఆడే అవకాశం వస్తుందని చెప్పాడు. స్వింగ్, సీమ్.. టీమిండియా ఇక్కడ చాలా మ్యాచ్లు గెలుస్తుందని సుందర్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ కల్చర్ వల్లే ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ దొరికిందని కరుణ్ నాయర్అభిప్రాయపడ్డాడు. దీన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటానన్నాడు.