
- అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్
- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ యత్నం
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తలెత్తిన ‘ఫొటోల’ గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్లే... రాజన్న సిరిసిల్ల జిల్లా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్యెల్యే కేటీఆర్ ఫొటో పెట్టడం లేదంటూ గత వారం రోజులుగా బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్మీట్లు పెడుతూ, సోషల్ మీడియా లో విమర్శిస్తున్నారు. వేదికపై ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో కేటీఆర్ ఫొటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ లీడర్లు.. సిరిసిల్ల ఎమ్యెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం రేవంత్రెడ్డి ఫొటోతో క్యాంప్ ఆఫీస్కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చి కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గకపోగా.. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.