- లాయలిస్టుల పేరుతో సీనియర్ల మీటింగ్లు
- కౌంటర్గా రేవంత్ వర్గం ప్రెస్మీట్లు
- రేవంత్ పర్సనల్ షో చేస్తున్నరు: జగ్గారెడ్డి
- పార్టీలో కోవర్టులున్నరు: యువ నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. రేవంత్ను వ్యతిరేకిస్తున్న పార్టీ లాయలిస్టుల ఫోరం నేతలు ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. దీనికి కౌంటర్గా కొందరు యువ నేతలు గాంధీభవన్లో ప్రెస్మీట్ పెట్టారు. పార్టీలో కోవర్టులున్నారని వారు ఆరోపించారు. కాగా, తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని, ఒకవేళ చేస్తే రోజుకో బండారం బయటపెడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. రేవంత్ పర్సనల్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిటీలోని ఓ హోటల్లో సమావేశమైన లాయలిస్టు నేతలను ప్రెస్మీట్ అనంతరం అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్ కలిసే ప్రయత్నం చేశారు. జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. తాను పార్టీలో అనుభవిస్తున్న వేదనను జగ్గారెడ్డి వారితో పంచుకున్నారు.
ఆయన ఆవేదన తమకు అర్థమైందని, ఇతర సీనియర్ నేతల సమస్యలు కూడా వారం, 10 రోజుల్లో పరిష్కారం అవుతాయని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఏమిటీ పంచాది?
రేవంత్కు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీ కోసం ఏండ్లుగా పని చేసే వాళ్లకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్లాంటి నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు లోలోపల తమ అసంతృప్తి వెళ్లగక్కారు. అధిష్టానానికి నివేదికలు కూడా పంపారు. అయితే ఇవేవీ రేవంత్ పీసీసీ పీఠంపై కూర్చోవడాన్ని ఆపలేకపోయాయి. దీంతో కొందరు రేవంత్కు అనుకూలంగా మారిపోగా, కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు మాత్రం అదే స్టాండ్తో ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి కొందరు సీనియర్ నేతలు రేవంత్తో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేసినా ఆయన కలుపుకుపోవడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. కాగా, రేవంత్ వర్గీయులు మాత్రం.. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా కలవడం లేదని, పార్టీ ఫోరంలో చర్చించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
లాయలిస్టుల ఫోరం
కాంగ్రెస్లో పుట్టి పెరిగిన నేతలు కొందరు లాయలిస్టుల ఫోరం పేరుతో ఒక్కటయ్యారు. ఇందులో మెజారిటీ సీనియర్లే. పార్టీ పరిస్థితిపై చర్చించే పేరుతో వీరు ఈ మధ్య తరచూ కలుస్తూనే ఉన్నారు. కొంత కాలం కింద పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో వీళ్లు భేటీ అయ్యారు. దీన్ని రహస్యంగా ఉంచారు. కాగా, వారం పది రోజుల కింద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కలిశారు. ఈ భేటీ గురించి మీడియాకు లీక్ అయింది. నేతలు కూడా మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం గురించి చర్చించామని చెప్పినా.. అందులో రేవంత్ తీరు, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ వ్యవహార శైలిపై చర్చ జరిగినట్లు లీక్ అయింది. హైకమాండ్కు ఈ విషయాలను విన్నవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, పొన్నాల, కోదండరెడ్డి, శ్రీధర్బాబు, శ్యాంమోహన్, కమలాకర్రావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం రేవంత్పై రగిలిపోతున్నారు. జగ్గారెడ్డి నియోజకవర్గంలో వేరే లీడర్ను పెడితే గెలుపోటముల అవకాశాలు ఎలా ఉంటాయని రేవంత్ సర్వే చేయించారని, దీన్ని జగ్గారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఆదివారం లాయలిస్టు ఫోరం నేతలు మరోసారి భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా హైకమాండ్ను కలవాలని, రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ వైఖరులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మీటింగ్ పెట్టినోళ్లపై చర్యలు తీసుకోవాలె: యువ నేతలు
కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న టైమ్ ఇదని, ఇలాంటి టైమ్లో పార్టీకి అండగా ఉండకుండా కొంత మంది మీటింగ్లు పెట్టి వ్యతిరేకిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, నేతలు మానవతా రాయ్, ఇరవర్తి అనిల్ అన్నారు. సమస్యలు ఉంటే పార్టీ నేతలతో చర్చించకుండా మీటింగ్లు పెట్టడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. గాంధీ భవన్లో వీళ్లు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను విడగొట్టాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంత్రి హరీశ్ను కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్యంగా కలిశారని అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని, కొత్త టీమ్ వచ్చాక పార్టీ బలోపేతమైందని బెల్లయ్య నాయక్ అన్నారు. జగ్గారెడ్డి, వీహెచ్ కు సమస్యలుంటే పార్టీలో చర్చించాలని చెప్పారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్, బీజేపీ కోవర్టులున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని మానవతరాయ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నామని అనిల్ అన్నారు.
సస్పెండ్ చేస్తే.. రోజుకో బండారం బయట పెడ్తా : జగ్గారెడ్డి
పార్టీ మంచి కోసమే తాము సమావేశమయ్యామని, ఇందులో తప్పేముందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు షోకాజ్ఇస్తే సమాధానం చెప్తానన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్కు, సోనియా, రాహుల్కు విధేయుడిగా ఉంటానని తెలిపారు. ఏ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానన్నారు. అయితే తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదని, ఒకవేళ చేస్తే రోజుకో బండారం బయటపెడ్తానని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఎవరినైనా పోటీకి పెట్టి గెలిపిస్తానని రేవంత్ చాలెంజ్ చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. రేవంత్ పార్టీ లైన్లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు.