జైలు క్లర్క్​గా సిద్ధూ!

జైలు క్లర్క్​గా సిద్ధూ!


పాటియాలా : కాంగ్రెస్​ లీడర్ నవజ్యోత్​సింగ్​ సిద్ధూ పాటియాలా సెంట్రల్​ జైలులో క్లర్క్​గా పనిచేయనున్నారు. 1998 నాటి కేసులో సిద్ధూకు ఇటీవల పంజాబ్​ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దోషులుగా తేలిన వారు జైలులో రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారికి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందులో భాగంగా తొలి మూడు నెలలు దోషులుగా తేలిన ఖైదీలకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత రోజు వారీగా వారికి రూ.40 నుంచి రూ.9‌‌‌‌0 వరకు వేతనం పొందే అర్హత సాధిస్తారు. ఖైదీల నైపుణ్యాన్ని బట్టి వారికి ఎంత చెల్లించాలనేది జైలు అధికారులు నిర్ణయిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా సిద్ధూ తన బ్యారక్​ నుంచే క్లర్క్​ పని చేయనున్నారు. అక్కడికే అధికారులు ఫైల్స్​ పంపనున్నారు. కోర్టు తీర్పులను, జైలు రికార్డులను నమోదు చేయడమే సిద్ధూ చేయాల్సిన పని.

34 ఏళ్ల క్రితం పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతడి అనుచరుడు రూపీందర్ సింగ్ సంధు గొడవ పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్ర గాయలపాలైన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1999లో ఈ కేసు విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు... సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ, అతడి అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది.  అయితే ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తూ  తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు... ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే.. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.

అయితే తీర్పు ఇచ్చే సమయంలో దీనిపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్,ఎస్కే కౌల్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ధృఢంగా ఉన్న వ్యక్తి యొక్క చెయ్యి కూడా ఒక్కోసారి ఆయుధంగా మారుతుందని వ్యాఖ్యానించింది. నేరస్థుడికి శిక్షపడకపోతే అది బాధితుడిని మరింత అవమానపరిచినట్లేనని పేర్కొంది. ఈ కేసులో జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించడం సుముచిత నిర్ణయంగా భావిస్తున్నాం. అందుకే ఏడాది జైలు శిక్ష విధిస్తున్నామని  తెలిపింది. సానుభూతితో సరైన శిక్ష విధించని పక్షంలో న్యాయవ్యవస్థకు మరింత హానీ కలుగుతుంది, కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతోందని  జస్టిస్ ఏఎం ఖన్విల్కర్,ఎస్కే కౌల్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం : -
మహిళా ఎంపీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు



కేంద్రంలో మార్పు తథ్యం